హైదరాబాద్ : ఉత్తర బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ తరువాత మరో 24 గంటల్లో బలపడి ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ అల్పపీడనం ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉంటుందని తెలిపింది.
అయినప్పటికీ శని, ఆదివారాల్లో పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. ఆదివారం నాడు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. కాగా రాగల 48 గంటల్లో అకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది.