హైదరాబాద్, జూలై 17 (నమస్తేతెలంగాణ): ఎల్ నినో ప్రభావంతో కరువు తరుముకొస్తుంటే రాష్ట్రంలో సాగు విషయంపై కాంగ్రెస్ సర్కార్కు సోయిలేకుండా పోయిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. అప్రమత్తం కావాల్సిన ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా సాగునీళ్ల కోసం రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులు వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తకుండానే ఎండిపోతున్నాయని, వరినార్లకు ట్యాంకర్ల ద్వారా నీరందించే దుస్థితి నెలకొన్నదని తెలిపారు. నదుల నీళ్లను ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ఒడిసి పట్టుకొంటున్నాయని గుర్తుచేశారు. కానీ గోదావరి, కృష్ణా నీళ్లను ఎత్తిపోయకుండా రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై కక్షతోనై రైతులపై ప్రభుత్వం పగ సాధిస్తున్నదని ఆరోపించారు. కన్నెపల్లి పంప్హౌస్ మోటర్లను ఆన్చేయకుండా ఏపీకి నీళ్లను వదులుతున్నదని విమర్శించారు. పంటలు పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుందని భావించిన ప్రభుత్వం.. నీరందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్పై కోపంతో రైతుల గొంతుకోయడం అన్యాయమని విమర్శించారు. అప్పుల విషయంలోనూ గత బీఆర్ఎస్ సర్కార్ను బద్నాం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లుతెరిచి కన్నెపల్లి నుంచి నీళ్లను ఎత్తిపోసి రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలివ్వకుండా నిరుద్యోగ యువతకు అన్యాయం చేసిన ప్రభుత్వం ఇప్పుడు సరూర్నగర్ బీఆర్ఎస్ సభను అడ్డుకొంటున్నదని ఆరోపించారు.