జూలూరుపాడు, జూలై 17 : తమ పంట భూములకు సీతారామ ప్రాజెక్టు పిల్ల కాలువల ద్వారా నీరందించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రామచంద్రాపురం సమీపంలోని ప్రధాన కాలువపై శుక్రవారం రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం మండల నాయకుడు చందర్, రైతులు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోనే సాగునీటి సదుపాయం లేని ఏకైక మండలంగా జూలూరుపాడు ఉందని, ఇదే మండలం మీదుగా సీతారామ జలాలు వెళ్తున్నా స్థానిక ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. వెంటనే సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని, లేదంటే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.