గజ్వేల్, జూలై 17: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే చీల్చి చెండాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు. రిజర్వాయర్లు నింపి సాగునీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్పై రైతులతో కలిసి ఆయన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ.. కన్నెపల్లి వద్ద వెంటనే మోటర్లను ఆన్ చేసి ప్రాజెక్టులను గోదావరి జలాలతో నింపాలని డిమాండ్ చేశారు. ఆంధ్రాకు నీటిని వృధాగా పోనిస్తూ చంద్రబాబు మెప్పు పొందాలనే ఆలోచనలో రేవంత్రెడ్డి ఉన్నారని ఆరోపించారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం కేసీఆర్ నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణలో సాగు, తాగునీటి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసుకుంటే అందులో భాగమైన ప్రాజెక్టులను నింపకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ప్రతి రోజూ లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధాగా ఆంధ్రాకు తరలిపొతున్నాయని చెప్పారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వద్ద వెంటనే పంప్లను ఆన్చేసి అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ను నింపుకొని ఎస్సారెస్పీకి నీటిని తరలించాలని కోరారు. బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసిన చరిత్ర కాంగ్రెస్దని ఆరోపించారు. కేసీఆర్కు పేరు వస్తున్నదనే అక్కసుతో రెండు పిల్లర్లను మరమ్మతు చేయకుండా రేవంత్రెడ్డిగ ప్రాజెక్టులను ఎడారిగా మార్చుతున్నాడని దుయ్యబట్టారు. ఎల్ నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ ప్రజలకు తాగునీరు దొరకని దుస్థితి రానుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాజెక్టులను ఎండబెట్టి ఎడారిగా మార్చేస్తున్న రేవంత్రెడ్డి తీరుపై త్వరలోనే రైతులతో కలిసి పాదయాత్ర చేపడుతామని హెచ్చరించారు.