హైదరాబాద్: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. మబ్బులకు చిల్లుపడినట్లుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జిల్లాల్లో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లపైకి వరద పోటెత్తడంతో రాకపోకలు బందయ్యాయి. సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది.
గత 24 గంటల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ముత్తారంలో అత్యధికంగా 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లాలోని కాటారం 26.7 సెంటీమీటర్లు, మహదేవ్పూర్ 24.6 సెం.మీ, నిర్మల్ జిల్లా ముథోల్లో 22.8, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 21.2, మంచిర్యాల జిల్లా చెన్నూరులో 19.8, నిర్మల్ జిల్లా బైంసాలో 19.1, నిజామాబాద్ జిల్లా మందపల్లెలో 17.4, మాచెర్లలో 17.3, నవీపేటలో 17.0, పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లిలో 16.5, నిజామాబాద్ జిల్లా మగిడిలో 16.3, రేంజల్లో 16.2, జక్రాన్పల్లిలో 15.8, నిర్మల్ జిల్లా తనూరు, మంచిర్యాల జిల్లా నీల్వాయిలో 15.7 చొప్పున వర్షపాతం నమోదయింది.
భారీ వర్షాల దృష్ట్యా నిజామాబాద్ కలెక్టరేట్లో అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వర్షాలతో ఇబ్బందిపడుతున్న జిల్లావాసులు 08462-220183, నిజామాబాద్ నగరానికి చెదినవారు 08462-221001 నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు.
కాగా, మరో మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతారణ శాఖ హెచ్చరించింది. నేడు ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.