నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడిగెల చెరువుకు గండి పడింది. దీంతో ఆర్మూర్-జగిత్యాల మధ్య రాకపోకలు అంతరాయం ఏర్పడింది. జలాల్పూర్ వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. కమ్మర్పల్లి పోలీస్స్టేషన్ నీటమునిగింది. వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashanth reddy) పరిశీలించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
కామారెడ్డి, మాచారెడ్డి, బిక్కనూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. దోమకొండ, బీబీపేట్ మండలాల్లో మోస్తారు వర్షపాతరం నమోదయింది. కుండపోతగా కురిసిన వానతో కామారెడ్డిలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భీమేశ్వర వాగు, పాల్వంచ వాగు, ఎడ్లకట్ట వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిర్కూర్ మండలంలో ముంపు బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో జుక్కల్ మండలం కౌలాస్ నలా ప్రాజెక్టు ఒక గేటును అధికారులు ఎత్తివేశారు.
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 8 గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో గోదావరి నదిలోకి 20,800 క్యూసెక్కుల వరద వెళ్తున్నది. విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 4000 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 90 టీఎంసీలుకాగా ప్రస్తుతం 76 టీఎంసీలరే చేరుకున్నది. ఎగువ మహారాష్ట్ర గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి దాదాపు 2 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది.
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 18 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. ప్రస్తుతం 1402.5 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయిన నీటిమట్టం 1405 అడుగులు. జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 14.411 టీఎంసీలు కాగా, ఇప్పుడు 17.80 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.