మహబూబ్నగర్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను మరోసారి వాన ముంచెత్తింది. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు కుండపోత వాన కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లి చెరువుకు గండిపడింది. కొల్లాపూర్ సమీపంలో నార్లపూర్ ఎర్రగట్టు పెద్దవాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
వనపర్తి జిల్లా కేంద్రంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. దుందుభీ, ఊకచెట్టువాగుల్లో వరద పెరిగింది. ఎన్నో చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు అలుగు పారాయి. కోయిల్సాగర్కు భారీ వరద రావడంతో ఐదు గేట్లు ఎత్తి 13 వేల క్యుసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సంగంబండ పెద్దవాగుకు వరద వస్తుండటంతో మూడు గేట్లు ఎత్తారు. సరాళసాగర్ సైఫన్లు తెరుచుకున్నాయి.
కోయిలకొండ మండలంలో దామయపల్లి, ఆచార్యపూర్ల మధ్య వాగు పొంగి ప్రవహిస్తున్నది. పాలమూరులో జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ వెంకట్రావు, అధికారులు పర్యటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి టెలీకాన్ఫరెన్స్లో అధికారులను ఆదేశించారు.