హైదరాబాద్ : కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు మండలాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలుల బీభత్సంతో కరీంనగర్లో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చొప్పదండి, రామడుగు, మానకొండూరు, శంకరపట్నం, జగిత్యాల జిల్లా పెగడపల్లి, పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో విద్యుత్ స్తంభాలు నేలకూలగా.. చెట్లు విరిగిపడ్డాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గీత భవన్ వద్ద భారీ విద్యుత్ అలంకరణ లుమినార్ కూలిపోయింది. కర్రలతో 70 అడుగుల ఎత్తున లుమినార్ను ఫిబ్రవరిలో జరిగే బ్రహ్మోత్సవాల కోసం నిర్మించారు. రూ.45లక్షలతో ఏర్పాటు చేశారు. రాముడి పట్టాభిషేకం ఆవిష్కరించేలా కటౌట్ను ఏర్పాటు చేశారు.