ఖమ్మం: మిగ్జాం తుఫాను (Michaung Cyclone) ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచాలం, అశ్వారావుపేట, నేలకొండపల్లి, ఇల్లందు, అన్నపురెడ్డిపల్లి, కల్లూరు, ఆళ్లపల్లి, సత్తుపల్లి, దమ్మపేట, కూసుమంచి, కారేపల్లి మండలాలతోపాటు పాల్వంచ, తిరుమలాయపాలెంలో జోరుగా వర్షం కురుస్తున్నది. సత్తుపల్లిలో కురుస్తున్న వర్షానికి జేవీఆర్ఓసీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
ఇక మంగళవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట, కత్బుల్లాపూర్, సుచిత్ర, రాయదుర్గం, బహదూర్పల్లి, సూరారం, మియాపూర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, హైదర్నగర్, ఆల్విన్కాలనీ, మూసాపేట, ప్రగతినగర్, నిజాంపేట్, మేడ్చల్, కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గండిమైసమ్మ, బోరబండ, అల్లాపూర్, రహమత్నగర్, మధురానగర్, సనత్నగర్, ఎస్ఆర్నగర్, మైత్రివనం, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎల్బీనగర్, హయత్నగర్, ఉప్పల్, బీఎన్రెడ్డిలో వర్షం కురిసింది.
మిగ్జాం తుఫాను కోస్తాంధ్ర తీరానికి సమాంతరంగానే కదులుతున్నదని వాతావరణ శాఖ తెలిపింది. తుఫానులో కొంతభాగం సముద్రంలో, మరికొంతభాగం భూమిపై ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. తీరానికి అత్యంత దగ్గరగా తీవ్ర తుఫాను కదులుతున్నదని, తుఫాను కేంద్రంలోని మేఘాలు భూభాగంపై ఉన్నట్లు పేర్కొంది. గడిచిన 6 గంటలుగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా తీవ్ర తుఫాను కదులుతున్నదని చెప్పింది. కావలి తీరానికి 40 కిలోమీటర్లు, బాపట్లకు 80 కిలోమీటర్ల దూరంలో తీవ్రతుఫాను కేంద్రీకృతమై ఉన్నదని తెలిపింది. ప్రస్తుతం తీరప్రాంతంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని ప్రకటించింది.