మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను భారీ వర్షం ముంచెత్తింది. దీంతో జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎడతెరపిలేకుండా వాన కురుస్తున్నది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని రామయ్య బౌలి, బీకే రెడ్డి కాలనీ, శెట్టి కాలనీ, వల్లభ్నగర్, గణేష్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇండ్లు నీటమునిగాయి. పాలమూరు ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున వరద నీరు పారుతున్నది. వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ వెంకట్రావు మున్సిపల్ అధికారులతో కలిసి పరిస్థితి సమీక్షించారు. ఇండ్లలోకి నీళ్లు చేరకుండా మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టారు.
మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడుతున్నది. దీంతో వాగులు, ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం నుంచి కురుస్తున్న వానలతో చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు (సంఘం బండ) భారీగా వరద వస్తున్నది. దీంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు.
కోల్సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తింది. దీంతో అధికారులు ఐదు గేట్లు ఎత్తి 3500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 3600 క్యూసెక్కుల నీరు వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 2.270 టీఎంసీలు, ప్రస్తుతం 2.200 టీఎంసీలు ఉన్నాయి.
వనపర్తి జిల్లాలోలో భారీ వర్షం కురిసింది. దీంతో ఊకచెట్టు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కొత్తకోట-ఆత్మకూరు ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన సరళసాగర్ సైఫన్లు తెరచుకోవడంతో కాజ్వేపై నుంచి వరద ప్రవహిస్తున్నది. పెద్దమండలి మండలం దొడగుంటపల్లి వద్ద చెరువు తెగిపోయింది. దీంతో పంటపొలాలు నీటమునిగాయి. నారాయణపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. ధన్వాడ మండలంలోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాగుల ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి.