నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 21: రాష్ట్రంలోని పలుచోట్ల ఆదివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం తరువాత నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. అకాల వర్షానికి వివిధ ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు విరిగాయి. భారీ చెట్లు సైతం రోడ్లకు అడ్డంగా.. ఇండ్లపై కూలాయి. ఇండ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్లో వరి కోత పనులు జరిపిస్తుండగా వెల్గొండ గ్రామానికి చెందిన నాగయ్య, అతని కుమారుడు రమేశ్ (25), మరో వ్యక్తి కృష్ణ పిడుగుపాటుకు గురయ్యారు. రమేశ్ మృతి చెందగా.. నాగయ్య, కృష్ణ గాయపడ్డారు. తిమ్మాజిపేట మండలం చంద్రాయన్పల్లి తండాలో పిడుగుపడటంతో ఇంటి ఆవరణలో ఉన్న రాధ అనే మహిళ అస్వస్థతకు గురైంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో జల్లులు కురిశాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లి, శేరిలింగంపల్లి, షేక్పేట్, ఉప్పల్, సికింద్రాబాద్, గచ్చిబౌలి, కొంపల్లి, సుచిత్ర తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కొన్ని చోట్ల చిరుజల్లులు పడటంతో నగరవాసులు ఎండల తీవ్రత నుంచి కొంత ఉపశమనం పొందారు.
మూడు రోజులు వర్షాలు
ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాబోయే మూడురోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఒకవైపు ఎండలు దంచికొడుతుండగా, మరోవైపు పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో, మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలతో పాటు వికారాబాద్, మెదక్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఎండల తీవ్రత తగ్గింది. 40 డిగ్రీల లోపే పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.