జనగామ : జనగామ జిల్లాలో రాత్రి భారీ వాన కురిసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంతో పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జఫర్గఢ్ మండంలోని కూనూర్ గ్రామంలో తెల్లవారుజామున పిడుగుపాటుకు మొహినుద్దీన్ కు చెందిన ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. మొహినుద్దీన్ ఇంటిలో, అతని తల్లి చాంద్ బీ బయట రేకుల కింద నిద్రిస్తుండగా ఇంటి ఎలివేషన్ పై పిడుగుపడింది. దీంతో ఎలివేషన్, పొర్టికో, రేకులు, బైక్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. చాంద్ బీకి తృటిలో ప్రాణాపాయం తప్పింది.
విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. జరిగిన నష్టానికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధితులు అధికారులను కోరారు.