Heavy Rains | తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవగా.. వాగులు, వంకలు పొంగుతున్నాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. అయితే, రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఉత్తర ద్వీపకల్ప భారత దేశం అంతటా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈస్ట్ వెస్ట్ షీర్ జోన్ వ్యాపించి ఉందని ఐఎండీ తెలిపింది.
శుక్రవారం దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరాలకు ఆనుకుని.. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంలో ఉన్న ఆవర్తనం ప్రభావంతో శనివారం ఉదయం ఒడిశా, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ప్రదేశం ఏర్పడింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ వరకు విస్తరించి.. ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంపు తిరిగి ఉన్నది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
శనివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఈ మేరకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
జగిత్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇవాళ అత్యధికంగా నిర్మల్ జిల్లా ముధోల్లో 20 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. బైంసాలో 16.8 సెంటీమీటర్లు, జక్రాన్పల్లిలో 15.3 సెంటీమీటర్లు, బాసరలో 14.9 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీఎస్ డీపీఎస్ నిజామాబాద్ జిల్లాలో అతిభారీ వర్షాలు కురిశాయి. నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కుమ్రభీంతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని టీఎస్ డీపీఎస్ పేర్కొంది.