హైదరాబాద్ నగరంలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్సాగర్ జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. రెండు మూడు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షానికి కూకట్పల్లి నాలానుంచి భారీగా వరదనీరు హుస్సేన్ సాగర్కు వస్తున్నది. దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది.
సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లుకాగా, ప్రస్తుతం 513.50 మీటర్లకు నీరు చేరింది. అంటే సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టంకంటే ఎక్కువ వరదనీరు చేరింది. సాగర్ గరిష్ఠ నీటిమట్టం 514.75 మీటర్లు. గరిష్ఠానికి మరో మీటర్ దూరం మాత్రమే ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గరిష్టనీటిమట్టం దాటితే తూముల ద్వారా దిగువకు నీటిని విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.