హైదరాబాద్: కేజీ టు పీజీ ఉచిత విద్య అందించాలనేది సీఎం కేసీఆర్ తాపత్రయమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురుకులాల్లో సీట్ల కోసం పోటీ పడుతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వందలకుపైగా గురుకులాలను ఇంటర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసుకున్నామని తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబిత సమాధానమిచ్చారు.
జూనియర్ కాలేజీల్లో ఉండే విద్యార్థుల సంఖ్యను బట్టి డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో 6 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉండగా 7 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఎన్ని కాలేజీలు అవసరమున్నాయో నివేదికలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 56 మహిళా డిగ్రీ కాలేజీలను ఏర్పాటుచేసుకున్నామన్నారు.