Telangana | సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ రైతు వీడియోపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ” నీళ్లు లేవు, వ్యవసాయం లేదు… చావాలనిపిస్తోంది కేసీఆర్ సారూ” అంటూ ఆ రైతు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ ఎక్కడ ఉన్నా మళ్లీ రావాలి.. తనతో పాటు మరో పదిమందితో కేసీఆర్కే ఓటు వేయిస్తానంటూ భావోద్వేగానికి గురయ్యారు. తన వీడియోను రికార్డు చేసి కేసీఆర్ పంపించాలంటూ నల్లగొండ జిల్లా ముషంపల్లికి చెందిన రైతు మల్లయ్య.. ఓ యువకుడిని కోరగా అతను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు వైరల్గా మారింది. కొందరు నెటిజెన్లు ఆ వీడియోను కేటీఆర్కు ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. రైతు మల్లయ్య వీడియో తన గుండెను తాకిందన్నారు. తాను ముషంపల్లి గ్రామానికి వెళ్లి .. మల్లయ్యను, బోర్వెల్ రాంరెడ్డిని వ్యక్తిగతంగా కలుస్తానని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ వెల్లడించారు.
This is a video message that touched my heart 🙏
I will visit Mushampalli village personally and meet Mallaiah Garu and also “Borewell Ram Reddy Garu” soon https://t.co/zcCF9fapPC
— KTR (@KTRBRS) March 12, 2024
” ఇప్పటికైనా నువ్వు గెలవాలి. నువ్ గెలిస్తేనే మాకు బుక్కెడు బువ్వ. లేకుంటే సచ్చిపోతం. నీళ్లు లేవు. నిప్పులు లేవు. తినటానికి బుక్కెడు బువ్వ లేదు. మాకు ఏదీ లేదు. కేసీఆర్ సారు.. నువ్వు ఎక్కడ ఉన్నా రావాలి. నువ్ వచ్చినంకనే పట్టెడు బువ్వ తిన్నం. చెల్కలకు వోతే సంతోషంగా ఉండేది. ఇయ్యాళ్ల చెల్కల్ మొత్తం మేకలు మేస్తున్నయ్. కడుపు గుద్దుకుంటున్నా. సావాలనిపిస్తుంది. నా కొడుకు సచ్చిపోయిండు. ఒక్కడినే ఉన్నా. నాకు పట్టెడు బియ్యం ఎవరు పెట్టాలి. నా ఓటుతో పాటు పదిమందితో నేను కేసీఆర్కు ఓటేపిస్తా. కేసీఆర్ సారు నువ్వే గెలవాలి. ఇప్పటికీ నాకు రైతుబంధు లేదు. నువ్వు ఉన్నన్నొద్దులు రైతు బంధు వస్తే వ్యవసాయానికి అప్పు కాలేదు. ఇప్పుడు అప్పుల పాలైన. నాకు బుక్కెడు బువ్వ వేసేటోడు లేడు. నా పొలం ఎండిపోయింది. తోట ఎండిపోయింది. నాయినా నీ కాళ్లు మొక్కుతా. నీకు ఎట్లా అంటే అట్లే ఓటేస్తా. ఢిల్లీల ఉన్నా నేను కేసీఆర్ దగ్గరికి వస్తా. నీకే ఓటేస్తా” అంటూ రైతు భావోద్వేగానికి గురయ్యారు.