కోరుట్ల రూరల్, సెప్టెంబర్ 13: అన్న మరణ వార్త విని చెల్లి గుండె ఆగింది. ఈ విషాదకర ఘటన.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరులో విషాదాన్ని నింపింది. రంగుల పోశాలు (60) బతుకుదెరువు కోసం 20 ఏండ్ల కిందట నిజామాబాద్ జిల్లా మోస్రా గ్రామం నుంచి వచ్చి కోరుట్ల మండలం కల్లూరులో స్థిరపడ్డాడు. కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.
కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. మోస్రా గ్రామంలోనే ఉండే సోదరి రంగు పోచవ్వ(52)కు అన్న మరణ వార్త తెలియడంతో కన్నీటిపర్యంతమైంది. ఏడుస్తూనే, గుండెపోటుతో నేలకొరిగింది. అన్నాచెల్లెళ్ల మృతితో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పోశాలుకు భార్య, కొడుకు, కుమార్తె, పోచవ్వకు భర్త, ఇద్దరు కొడుకులు ఉన్నారు.