హైదరాబాద్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కార్యదర్శి హోదా పోస్టుల్లో ఐపీఎస్ అధికారులను నియమిస్తూ నిరుడు సెప్టెంబర్ 28న జారీ అయిన జీవో 1342పై సికింద్రాబాద్కు చెందిన న్యాయవాది శ్రీకాంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ వేణుగోపాల్ శుక్రవారం విచారణ చేపట్టారు. క్యాడర్ నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ పోస్టుల్లో ఐపీఎస్ అధికారుల నియామకం చెల్లదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఐఏఎస్ క్యాడర్ పోస్టుల్లో ఐపీఎస్ అధికారుల నియామకాన్ని సవాల్ చేసేందుకు ఉన్న అర్హత ఏమిటో చెప్పాలని, దీని వల్ల నష్టపోయిన వారెవరైనా ఉ న్నారా అని ప్రశ్నించారు. ఒకవేళ ఉంటే వారిని ప్రతివాదులుగా చేర్చాలని సూచించారు. దీంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎక్స్అఫీషియో ముఖ్య కార్యదర్శిగా స్టీఫెన్ రవీంద్ర, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కమిషనర్, ముఖ్యకార్యదర్శిగా శిఖా గోయల్, హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్ ఆ విధంగా పనిచేస్తున్నారని న్యాయవాది చెప్పారు. తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేశారు.
అడ్డగోలుగా ఇసుక దోపిడీ ; 3 జిల్లాల్లో 19 మంది అరెస్టు, 24 వాహనాలు సీజ్
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. గత 2 రోజుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఆకస్మిక సోదాలే ఇందుకు నిదర్శనం. జగిత్యాల, హనుమకొండ, నిజామాబాద్ జిల్లాల పరిధిలో జరిపిన ఈ సోదాల్లో 30 మంది అక్రమార్కులను గుర్తించామని, 19మందిని అరెస్టు చేశామని డీజీ శిఖాగోయెల్ శుక్రవారం వెల్లడించారు. నిందితుల నుంచి 245 టన్నుల ఇసుకతోపాటు 24 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, వాటిలో 6 ఎక్స్కవేటర్లు, 2 లారీలు, 1 టిప్పర్, 15 ట్రాక్టర్లు ఉన్నాయని తెలిపారు. నిందితులు పగటిపూట ఇసుకను తవ్వి, చీకటి పడ్డాక లారీలు, టిప్పర్లలో తరలిస్తున్నారని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని చెప్పారు. ఎక్కడైనా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.