న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో పెరుగుతున్న కొవిడ్ కేసులు, ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కేసుల నమోదు నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. కొవిడ్ పరిస్థితిపై ఓ కన్నేసి, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ పెంచాలని రాష్ట్రాలను కోరినట్లు పేర్కొన్నారు. భయాందోళన వద్దన్నారు. గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నా భారత్లో కేసులు తగుతున్నాయన్నారు. చైనాలో కొవిడ్ కేసులు, మరణాలను గమనిస్తున్నామన్నారు.
దేశంలో అంతర్జాతీయ విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణీకులకు ర్యాండమ్గా ఆర్టీ పీసీఆర్ నమూనాలను సేకరిస్తున్నామన్న ఆయన.. మహమ్మారిని ఎదుర్కొనేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. కొవిడ్ పరిస్థితిని నిర్వహించడంలో ఆరోగ్యశాఖ చురుగ్గా పని చేస్తుందని, మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడడంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించిందన్నారు. ఇప్పటి వరకు దేశంలో 220 కోట్ల డోసులు వేశామని, పండుగ సీజన్, న్యూ ఇయర్ నేపథ్యంలో ప్రజలు మాస్క్లు ధరించేలా చూసుకోవాలని, శానిటైజర్లు ఉపయోగించాలని, బూస్టర్ డోస్పై అవగాహన కల్పించడంతో పాటు భౌతికదూరం పాటించేలా చూడాలని రాష్ట్రాలకు సూచించినట్లు వివరించారు.