Minister Harish Rao | భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఒక్కో యూనిట్లో 75 యూనిట్లు, మొత్తంగా 10వేల యూనిట్ల రక్త సేకరణ జరుగుతుందన్నారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని కంపోనెంట్గా వేరు చేసి అవసరమైన వారికి అందిస్తామని, దీంతో ఒకరి రక్తం ముగ్గురి ప్రాణాలు కాపాడుతుందన్నారు. టీచింగ్ ఆసుపత్రుల నుంచి అన్ని ఆరోగ్యకేంద్రాల్లో వైద్యసిబ్బంది రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజాప్రతినిధులు, అన్నివర్గాల ప్రజలు రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారన్నారు. ఇవాళ రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడం గొప్పగా ఉందని, మనమంతా ఒక్కటేనని, భారతీయులమన్నారు. కులం, మతం, జాతి బేధాలు లేవని మనమంతా చాటుతున్నామన్నారు. ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, పోరాటాలతో నేడు మనం స్వేచ్ఛా ఊపిరి పీల్చుకుంటున్నామని, వారి త్యాగాలను అందరు గుర్తుంచుకొని, దేశభక్తిని చాటాలన్నారు. అన్నదానం చేస్తే ఓ పూట ఆకలి తీర్చుకోవచ్చునని, విద్యాదానం చేస్తే జ్ఞానం పంచుకోవచ్చని.. అదే రక్తదానం చేస్తే ప్రాణాలు కాపాడవచ్చన్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం అవసరమని, అలాంటి సందర్భాల్లో ముందుకువచ్చి రక్తదానం చేసి ప్రాణాదాతలు కావొచ్చన్నారు. మానవతా హృదయంతో ఎంతో మంది తమ పనులన్నీ పక్కన పెట్టి ముందుకువస్తున్నారని, వారిది గొప్ప మనసు అన్నారు. రక్తదానం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందని, ఎన్నో కుటుంబాలను నిలబెడుతుందన్నారు. రక్తదానం సేవ మాత్రమే కాదని.. ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుంచుకోవాలన్నారు. రక్తదానంపై ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయని, ఆరోగ్యవంతులు ఎవరైనా రక్తదానం చేసి.. ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారందరికీ ప్రశంసాపత్రాలు అందజేసి, ప్రత్యేకంగా అభినందించారు.