హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): బస్తీ దవాఖానలు అనతికాలంలో దోస్తీ దవాఖానలుగా మారాయని, కోటి మందికిపైగా వైద్యసేవలు అందించాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. బస్తీ దవాఖానలతో వైద్యం పేదలకు మరింత చేరువైందని తెలిపారు.బస్తీ దవాఖానల్లో ఇప్పటి వరకు 1.48 లక్షల మందికి లిక్విడ్ ప్రొఫైల్ టెస్టులు (ఒక్కో టెస్టు రూ.800 విలువ) చేశామని పేర్కొన్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి దవాఖానలకు ఓపీ తగ్గిందని, దీనివల్ల సీరియస్ కేసులపై అక్కడి వైద్యులు దృష్టి సారిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం తొమ్మిది జిల్లాల్లో ఉన్న న్యూట్రిషన్ కిట్ను, ఏప్రిల్లోపు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రవేశ పెడతామని చెప్పారు. ఆదివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, గణేశ్ బిగాల, కోరుకంటి చందర్, జాఫర్ హుస్సేన్, భూపాల్రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు. బస్తీ దవాఖానల్లో 1,00,800 మందికి థైరాయిడ్ పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. ప్రస్తుతం బస్తీ దవాఖానల్లో 57 పరీక్షలు చేస్తున్నామని, ఆ సంఖ్యను త్వరలోనే 134 పెంచుతామని ప్రకటించారు. ఆదివారం సెలవు కావడంతో కార్మికులు, సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అందుకే ఆదివారానికి బదులుగా బస్తీ దవాఖానలకు శనివారం సెలవు దినంగా మార్పు చేసినట్టు పేర్కొన్నారు. బస్తీ దవాఖానల్లో 158 రకాల మందులు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. నెలాఖరులోపు జీహెచ్ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి ప్రకటించారు.