Heavy Rains | హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): వర్షాల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ పూర్తిగా సన్నద్ధమైంది. మంత్రి హరీశ్రావు ఎప్పటికపుడు జిల్లాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. అన్ని విభాగాల అధిపతులు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సమీక్షలు నిర్వహిస్తూ, సలహాలు సూచనలు ఇస్తున్నారు. వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణ విషయంలో మంత్రి ఆదేశాల మేరకు ప్రసవ తేదీ దగ్గరగా ఉన్నవారిని ముందస్తుగా దవాఖానకు తరలిస్తున్నారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 176 మందిని దవాఖానకు తరలించారు. ఈ నెల 2వ తేదీ నుంచి 26 వరకు 327 మందిని ముందస్తుగా దవాఖానల్లో చేర్చారు. మొత్తంగా 503 మందిని దవాఖానల్లోని ‘బర్త్ వెయిటింగ్ రూం’లకు తరలించినట్టు అధికారులు తెలిపారు.
గర్భిణులకు తోడుగా సహాయకులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. సబ్ సెంటర్ స్థాయి నుంచి హైదరాబాద్లోని ప్రధాన దవాఖానల వరకు వైద్య సిబ్బంది పూర్తి సన్నద్ధంగా ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ వైద్య సేవలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రస్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ 040-24651119 ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా జిల్లా స్థాయిలో కాల్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో డీపీహెచ్ పరిధిలోని సిబ్బందికి సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్ప టికే సెలవుల్లో ఉన్న వారిని విధుల్లో చేరాలని ఆదేశించారు.