హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): వారం రోజుల్లోగా టెండర్లు పూర్తికావాలి. అన్ని పనులనూ గ్రౌండింగ్ చేయాలి. అలసత్వాన్ని సహించేది లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవు.. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణ రోడ్ల నిర్వహణ పనులపై హైదరాబాద్లో ఎస్ఈలు, సీఈలు సహా ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎకడైనా సమస్యలుంటే స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
కాంట్రాక్టర్లతో మాట్లాడి పనుల పురోగతి, అధికారుల పనితీరును మధింపు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో రూ.2,687 కోట్ల అంచనాతో 6,254 కిలోమీటర్ల మేర 3,010 బీటీ రోడ్లు మంజూరు అయ్యాయని వివరించారు. ఆయా పనులకు వారం రోజుల్లోగా టెండర్లు పూర్తి చేసి అన్నింటినీ గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. గతంలో మంజూరై, టెండర్లు పూర్తికాని, గ్రౌండింగ్ కాని పనులను రద్దు చేయాలని, వాటిని ఇతర నియోజకవర్గాలకు కేటాంచాలని ఆదేశించారు. పనుల నాణ్యతలో రాజీపడే సమస్యే లేదని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఈఎన్సీ సంజీవరావు, సీఈ సీతారాములు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.