Smita Sabharwal | తెలంగాణ రాష్ట్రంలో కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం తీరును ప్రతిపక్ష పార్టీలు సహా పలువురు ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు ఎండగడుతున్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ (Smita Sabharwal)కు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పోలీసులు పంపిన నోటీసులపై స్మితా సబర్వాల్ తాజాగా స్పందించారు.
గచ్చిబౌలి పోలీసులకు తాను పూర్తిగా సహకరించినట్లు చెప్పారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. ఆ పోస్టును తాను రీపోస్టు చేసినట్లే 2 వేల మంది షేర్ చేసినట్లు పేర్కొన్నారు. వాళ్లందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటారా..? చట్టం అందరికీ సమానమా.. ? ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. దీనిపై స్పష్టత కోరినట్లు స్మితా సబర్వాల్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
Have fully cooperated with Gachibowli police authorities, and given my detailed statement today as a law abiding citizen under BNSS Act.
The post was reshared by 2000 individuals on this platform.
I sought clarification on whether same action is initiated for all!If not,…
— Smita Sabharwal (@SmitaSabharwal) April 19, 2025
కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న ‘హాయ్ హైదరాబాద్’ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన గిబ్లి తరహాలో ఉన్న ఇమేజ్ని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. సేవ్ హైదరాబాద్, సేవ్ హెచ్సీయూ బయోడైవర్సిటీ అని పేర్కొన్నారు. ఆ పోస్టులో మష్రూమ్ రాక్ ఎదుట భారీ సంఖ్యలో బుల్డోజర్లు మోహరించగా, బుల్డోజర్లకు ఎదురుగా నెమలి, జింకలు ఉన్నాయి. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇది ఫేక్ ఫొటో అంటూ అభియోగాలు మోపారు. ఈ మేరకు బీఎన్ఎస్ 179 సెక్షన్ కింద స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు పంపారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసిన పోలీసులు విచారణకు పిలుస్తున్నారు.
Also Read..
“స్మితా సబర్వాల్ మరో రీపోస్ట్”
“స్మితా సబర్వాల్కు పోలీసుల నోటీసులు”