హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): కేంద్రం నుంచి అన్ని రకాల అనుమతులు, సాంకేతిక క్లియరెన్స్లు లభించిన తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులపై పునఃసమీక్షించే అంశాన్ని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) 18వ సమావేశం ఎజెండాలో చేర్చడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు అభ్యంతరం వ్యక్తంచేశారు. శుక్రవారం కేంద్ర జల్శక్తి మంత్రి, సెక్రటరీకి లేఖ రాశారు. సీడబ్ల్యూసీ, జల్శక్తి శాఖల అనుమతులు పొందిన ప్రాజెక్టులపై కిందిస్థాయి బోర్డు సమీక్షించడం సరికాదని స్పష్టంచేశారు. ఏపీ పునర్విభజన చట్టం-2014, సెక్షన్ 85 కింద జోక్యం చేసుకొని తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని, పెండింగ్లో ఉన్న సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తిచేశారు. జీఆర్ఎంబీ 18వ మీటింగ్ ఎజెండాలో చేర్చిన 18.3.1, 18.3.6, 18.3.11 అంశాలను తక్షణమే వెనక్కితీసుకొనేలా బోర్డును ఆదేశించాలని లేఖలో కోరారు. ‘జీఆర్ఎంబీ తెలంగాణ ప్రాజెక్టులపై పునఃసమీక్షించాలని నిర్ణయించడం కేవలం రెండు రాష్ర్టాల మధ్య ఉన్న జలవివాదాలు కావు.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, అత్యున్నత సంస్థల అధికారులు, వాటి విశ్వసనీయతకు సంబంధించిన సున్నితవిషయం’ అని స్పష్టంచేశారు.
క్షుణ్ణంగా పరిశీలించాకే టీఏసీ ఆమోదం
నీటిపారుదల పథకాలకు సంబంధించిన సాంకేతిక, హైడ్రోలాజికల్, ఇంజినీరింగ్, పర్యావరణ, చట్టపరమైన అంశాలను సీడబ్ల్యూసీ, జల్శక్తి మంత్రిత్వశాఖలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపిందని హరీశ్ గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ అత్యున్నత సంస్థలు చట్టబద్ధంగా అనుమతులు ఇచ్చిన తర్వాత ఆ నిర్ణయాలను మళ్లీ సమీక్షించే, రద్దు చేసే అధికారం జీఆర్ఎంబీ సంస్థకు ఏమాత్రం ఉండబోదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. జల్శక్తి మంత్రిత్వ శాఖ ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలపై రివ్యూ చేసేందుకు జీఆర్ఎంబీకి అవకాశం ఇస్తే, అది కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రాధాన్యతను తగ్గించడమేనని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణలోని కాళేశ్వరం, చౌటుపల్లి హన్మంతరెడ్డి, ముక్తేశ్వరం, చనాక-కొరాట, మోడికుంటవాగు, కడెం-గూడెం, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ లాంటి కీలక ప్రాజెక్టులకు సుదీర్ఘ కసరత్తు, పరిశీలన ప్రక్రియ తర్వాతే క్లియరెన్స్లు లభించాయని పునరుద్ఘాటించారు. సీడబ్ల్యూసీ ఈ ప్రాజెక్టులను లోతుగా పరిశీలించిందని, కానీ పరోక్ష పద్ధతుల ద్వారా వీటిని తిరిగి తెరపైకి తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లోనూ రికార్డు
గతంలో కేంద్రం నిర్వహించిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ప్రాజెక్టుల క్లియరెన్స్కు సంబంధించిన అంశాలు స్పష్టమయ్యాయని హరీశ్ గుర్తుచేశారు. బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల అవసరాలు తీరిన తర్వాతే ఇంటర్ బేసిన్కు మళ్లించాలని రికార్డు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. సీడబ్ల్యూసీ నుంచి ఇప్పటికే హైడ్రోలాజికల్ అనుమతులు పొందిన సమ్మక్క సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్కు మిగిలిన చట్టబద్ధమైన అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. కేంద్రం అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులపై మళ్లీ పునఃసమీక్షించే అవకాశం ఇస్తే భవిష్యత్తులో జల్శక్తి శాఖ, సీడబ్ల్యూసీ ఇచ్చే ప్రతి అనుమతిపై అనిశ్చితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో తెలంగాణలో సాగునీటి అభివృద్ధి కుంటుపడటంతో పాటు, కోట్లాది మంది రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని స్పష్టంచేశారు. తాగునీటి భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి తక్షణమే స్పందించి జీఆర్ఎంబీ ఎజెండాలోని అంశాలను ఉపసంహరించుకొనేలా ఆదేశిలివ్వాలని విజ్ఞప్తిచేశారు. సమ్మక్క సాగర్, ఇతర పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని కోరారు. కేంద్రం సకాలంలో జోక్యం చేసుకొని తెలంగాణ నీటి హక్కులను కాపాడుతుందని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు.