పల్లెప్రగతితో గ్రామంలో కొత్త వెలుగులు
తీరిన చెత్తాచెదారం, రుగు సమస్య
ఆహ్లాదం పంచుతున్న ప్రకృతివనం
చివరి మజిలీకి చింతలేకుండా శ్మశానవాటిక
అద్దంలా మెరుస్తున్న వీధులు
ఎల్కతుర్తి, మార్చి 22 : ప్రభుత్వ చేయూత.. అధికారుల సహకారం, ప్రజాప్రతినిధుల అంకితభావం, ప్రజల భాగస్వాములైతే ఏ గ్రామమైనా అభివృద్ధిలో మేటిగా నిలుస్తుంది. ఇందుకు మంచి ఉదాహరణే ఎల్కతుర్తి మండలంలోని పెంచికల్పేట. ఈ గ్రామం పల్లెప్రగతి లక్ష్యాలు పూర్తయి అభివృద్ధి ఫలాలను అనుభవిస్తున్నది. ప్రభుత్వం క్రమం తప్పకుండా నెలనెలా ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి నమూనాగా, ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు, డ్రైనేజీల నిర్మాణంతో ఇప్పుడు గ్రామంలో చెత్తాచెదారం, మురుగు సమస్య తీరింది. ఏపుగా పెరిగిన పచ్చని మొక్కలతో పల్లె ప్రకృతివనం ఆహ్లాదాన్ని పంచుతున్నది. శ్మశానవాటిక నిర్మాణంతో చివరి మజిలీ చింత తీరింది.
పెంచికల్పేట గ్రామంలో మొత్తం 2,123 జనాభా ఉంది. పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం నెలనెలా రూ.5,59,819 నిధులిస్తున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామస్తుల సహకారంతో ఈ నిధులను ప్రణాళికా ప్రకారం ఖర్చు చేసి గ్రామాభివృద్ధికి బాటలు వేసుకున్నారు. వీటిలో నుంచి ఇటీవల గ్రామ పంచాయతీకి తీసుకున్న ట్రాక్టర్ లోన్ కట్టడంతో పాటు నలుగురు గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు, పల్లెప్రకృతి వనం ఏర్పాటు, నర్సరీల నిర్వహణ, హరితహారం మొక్కల సంరక్షణ, శానిటేషన్, వీధి దీపాలు, ట్రీ గార్డ్స్, ఇంటింటికీ తడి పొడి చెత్త సేకరణ బుట్టల పంపిణీ, మురుగు కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయం లేని వాడలకు పైపులు వేయడం తదితర పనులు చేయించారు. గ్రామంలో ఐదు ముఖ్య కూడళ్లలో ఎల్ఈడీ బల్బులు అమర్చారు. రూ.12.50లక్షలతో శ్మశాన వాటిక, రూ.2.50లక్షలుతో సెగ్రిగేషన్ షెడ్ నిర్మించారు. పల్లె ప్రకృతి వనం పనులు పూర్తయ్యాయి. అవెన్యూ ప్లాంటేషన్, ప్రకృతివనంలో దాదా పు 3,389 మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. గ్రామస్తుల నుంచి తడి, పొడి బుట్టల్లో సేకరించిన చెత్తను జీపీ ట్రాక్టర్ ద్వారా కంపోస్ట్ షెడ్డుకు తరలించి ఎరువును తయారు చేసి ప్రకృతి వనం, అవెన్యూ ప్లాంటేషన్లో నాటిన మొక్కలను వేస్తున్నారు. గ్రామంలోని 145 విద్యుత్ స్తంభాలకు థర్డ్ వైరును అమర్చారు. పల్లెప్రకృతి వనం, నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్లో పని చేస్తున్న ఐదుగురు కూలీలకు రోజుకు రూ. 230 చెల్లిస్తూ వాటిని సంరక్షిస్తున్నారు. ఏడు పాత ఇండ్లను కూల్చివేయడంతోపాటు రెండు పాత బావులను పూడ్చారు.
గ్రామం అభివృద్ధి బాటలో నడుస్తుంది
గ్రామంలోని ప్రతి వీధిలో మొక్కలు నాటి కాపాడుతున్నారు. ముఖ్యమైన కూడళ్లలో ఎల్ఈడీ బల్బులు అమర్చారు. ప్రజలందరికీ ఉపయోగపడేలా శ్మశాన వాటికను నిర్మించడం సంతోషంగా ఉంది. పట్టణాల్లో మాదిరిగా పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు రోడ్లను శుభ్రం చేయడంతోపాటు ఇంటికి వచ్చి తడి, పొడి చెత్తను ట్రాక్టర్లో తీసుకెళ్తున్నారు. – ముత్యాల రవీందర్రెడ్డి, గ్రామస్తుడు
పల్లెప్రగతి పథకం బాగుంది
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నది. నెలనెలా ప్రభుత్వం ఇచ్చే నిధులతో గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. శ్మశానవాటిక, కంపోస్టు షెడ్డు, పల్లెప్రకృతి వనం, డంపింగ్ యార్డులను అధికారులు నిర్దేశించిన గడువులోపు పూర్తి చేశాం. జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సైతం పల్లెప్రకృతి వనాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాలకవర్గం, ప్రజల సహకారంతోనే గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం.