Narendra Dabholkar | ప్రముఖ హేతువాది, మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి వ్యవస్థాపకులు నరేంద్ర దభోల్కర్ (Narendra Dabholkar) హత్య కేసులో ఇద్దరు నిందితులకు శిక్ష పడింది. ఈ కేసును విచారించిన పుణె కోర్టు.. ఇద్దరిని నిందితులుగా తేల్చింది. వారికి జీవితఖైదు విధించింది. మరోముగ్గురిని నిర్దోషులగా ప్రకటించింది.
2013 ఆగస్టులో దభోల్కర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఉదయం నడకకు వెళ్లిన ఆయనపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దభోల్కర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ తర్వాత ఈ కేసుసీబీఐకి బదిలీ అయ్యింది. ఈ కేసులో శరద్ కలస్కర్, సచిన్ అందూరే, వీరేంద్రసింగ్ తావ్డే, సంజీవ్ పునలేకర్, విక్రమ్ భావేను నిందితులుగా చేర్చారు.
అయితే, వీరిలో శరద్ కలస్కర్, సచిన్ అందూరేని పుణె కోర్టు తాజాగా దోషులుగా నిర్ధారించింది. వీరిద్దరే దభోల్కర్ను కాల్చినట్లు సీబీఐ విచారణలో తేలింది. దీంతో కోర్టు వీరికి జీవిత ఖైదు (Life In Prison), రూ.5లక్షల జరిమానా విధించింది. అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున వీరేంద్రసింగ్ తావ్డే, సంజీవ్ పునలేకర్, విక్రమ్ భావేలను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో 11 ఏళ్ల తర్వాత నిందితులకు శిక్ష పడింది.
మరోవైపు కోర్టు తీర్పును దభోల్కర్ కుటుంబ సభ్యులు స్వాగతించారు. అయితే, మిగతా వారిని నిర్దోషులుగా ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి కూడా శిక్ష పడాలని అన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని పుణె కోర్టు తీర్పుపై హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు.
Also Read..
Brazil | వరదలకు బ్రెజిల్ అతలాకుతలం.. 107 మంది మృతి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన ఎలాన్ మస్క్
viral video | మద్యం మత్తులో ముగ్గురు యువతులు హల్చల్.. ఇన్స్పెక్టర్ కాలర్ పట్టుకుని.. VIDEO