హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): బలహీన రాష్ర్టాలు-బలమైన కేంద్ర అన్నది బీజేపీ సిద్ధాంతమని, రాష్ర్టాలను కేంద్రం చెప్పుచేతల్లో ఉంచుకొనేందుకే ప్రయత్నిస్తున్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆక్షేపించారు. పన్నుల ఆదాయంలో 41 శాతం రాష్ర్టాలకు హక్కుగా పంచాల్సి ఉంటే, కేంద్రం 29.6 శాతమే ఇస్తున్నదని చెప్పారు. మిగతా 11.4 శాతం సెస్సుల రూపంలో కేంద్రం దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకొంటున్నదని మండిపడ్డారు. రాష్ట్రాలకు 62 శాతం ఖర్చులు ఉంటే 37 శాతం ఆదాయం వస్తున్నదని, కేంద్రానికి 37 శాతం ఖర్చులు ఉంటే 63 శాతం ఆదాయం వస్తున్నదని చెప్పారు.
న్యాయంగా రాష్ట్రాలకు 41 శాతం వాటా పంచాలని ఆర్థిక సంఘం స్పష్టంగా చెప్పినా కేంద్రం పెడచెవిన పెడుతున్నదని వివరించారు. బుధవారం టీఆర్ఎస్ ప్లీనరీలో ‘రాష్ర్టాల ఆదాయానికి గండికొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలి. డివిజబుల్ పూల్లోనే పన్నులు వసూలు చేయాలి’ అనే తీర్మానాన్ని హరీశ్రావు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్పై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి, స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ సెస్సుల పేరుతో డివిజబుల్ పూల్లోకి డబ్బులు రాకుండా కేంద్రం అడ్డుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏడేండలో సెస్సుల రూపంలో కేంద్రానికి రూ.24 లక్షల కోట్లు సమకూరాయని, రాష్ర్టానికి హకుగా మరో రూ.54 వేల కోట్లు రావాల్సి ఉన్నదని చెప్పారు.
గతంలో సెస్సులు 10 శాతముంటే, బీజేపీ వచ్చాక 20 శాతానికి పెంచిందని, గొర్రెలు తినేటోడు పోయి.. బర్రెలు తినేటోడు వచ్చినట్టయ్యిందని దుయ్యబట్టారు. సెస్సులు రద్దు చేయాలని, డివిజబుల్ పూల్లోకే డబ్బులు రావాలని, కేంద్రానికి ఏ రూపంలో డబ్బులు వచ్చినా రాష్ట్రాలకు 41 శాతం పన్నులను కేటాయించాలని తీర్మానంలో ప్రతిపాదించారు. అన్ని రాష్ర్టాల సీఎంలు ఏకతాటిపైకి వచ్చి, సెస్లు రద్దుచేసేలా, 41 శాతం ఆదాయం రాష్ర్టాలకు న్యాయబద్ధంగా ఇచ్చేలా పోరాడాలని కోరారు. మిషన్ భగీరథకు 20 వేల కోట్లు, మిషన్ కాకతీయకు 5 వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సూచిస్తే, ఒక్క రూపాయి ఇవ్వలేదని అసహనం వ్యక్తంచేశారు. 15వ ఆర్థికసంఘం రూ.6,103 కోట్లు గ్రాంట్గా ఇవ్వాలని సూచించినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటరని, కానీ బతుకు దుర్భర్ భారత్ అయ్యిందని ఎద్దేవాచేశారు.
ఏడేండ్లలో దేశ ఆర్థిక వృద్ధి 8 శాతం నుంచి 5.7 శాతానికి పడిపోయిందని, బీజేపీ ధరలు పెంచి, మతకల్లోలాలు సృష్టించి ప్రజలను ఇబ్బంది పెడుతున్నదని హరీశ్రావు ఆరోపించారు. ‘అచ్చేదిన్ అన్నరు. కానీ, దేశ ప్రజలకు సచ్చేదిన్ తెస్తున్నరు. నల్లధనం తెస్తమన్నరు. కానీ, రైతాంగానికి నల్లచట్టాలు తెచ్చారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తమని, ఉన్నవి ఊడగొడ్తున్నరు. కొత్త పరిశ్రమలు తెస్తమని, ఉన్నవి అమ్ముతున్నరు’ అ ని విమర్శించారు. కేంద్రం అమ్మిన ప్రభుత్వ రంగ సం స్థల విలువ మూడున్నర లక్షల కోట్లని, వీటిని విక్రయిం చి ఎస్సీ, ఎస్టీ బీసీలకు ఉద్యోగాలు లేకుండా చేశారని ఫైరయ్యారు. మోదీ రైల్వేస్టేషన్లో ఛాయ్ అమ్మాడని, బుల్లెట్ ట్రైన్లు తెస్తాడని ఊదరగొట్టారని..కానీ, ఆయన రైళ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్లు అమ్ముతున్నారని ఎద్దేవాచేశారు. బీజేపీ ప్రభుత్వం రాక ముందు నిరుద్యోగిత రే టు 4.7 శాతం ఉంటే, ఏడేండ్లలో 7.11 శాతానికి పెరిగిందని, రైతుల ఆదా యం డబుల్ చేస్తామని, పెట్టుబడి ఖర్చులు డబుల్ చేశారని చురకలంటించారు. టీమిండియా అంటూ బీజేపీయేతర రాష్ట్రాలను ఇబ్బంది పె డుతున్నారని, టీం లేదు , థీమ్ లేదు… ఉన్నది పొలిటికల్ గేమ్ అని విమర్శించారు. ఈ తీర్మానాన్ని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి బలపరిచారు. రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం తన గల్లాపెట్టెను నింపుకొనేందుకే ప్రయత్నిస్తున్నదని ఆక్షేపించారు. డివిజబుల్పూల్లో నిధులు పంచాలని డిమాండ్ చేశారు.