కాళేశ్వరం అప్పు కాదు.. 1.25 లక్షల కోట్ల ఆస్తి మేం ప్రజలకు నిరంతర పవర్ ఇస్తూ ఉంటం.. వాళ్లు బీఆర్ఎస్కు ఫుల్ పవర్ ఇస్తూనే ఉంటరు పాలమూరు రంగారెడ్డిని పూర్తిచేసి చూపిస్తం మీది ఫ్లోరైడ్ బండ.. మాది భగీరథ నీటి కుండఅధికారంలోకి రాలేమేమో అన్నదే విపక్షాల బాధ కేంద్రానిది అంత్యోదయ కాదు.. అదానీ సిద్ధాంతం బీజేపీకే అమృతకాలం.. ప్రజలకు ఆపదకాలం దేశ్కీ ఏక్ హీ ఆవాజ్.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ రైతుపై కేంద్రం కక్ష.. అందుకే రాష్ర్టానికి నిధుల కోత కేంద్రానివి తప్పులు.. పైగా రాష్ర్టాలకు సుద్దులు తంత్రాలైనా.. కుతంత్రాలైనా.. బీజేపీకే అలవాటు బడ్జెట్పై చర్చలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
సీఎం కేసీఆర్ ఒక స్వాప్నికుడు.. సాధకుడు.. శ్రామికుడు.. పరిశోధకుడు.. అధ్యయన శీలి.. సృజనశీలి.. కార్యశీలి.. అన్నిటికీ మించి ప్రజలే కేంద్రంగా, వారి జీవితాలే ఇతివృత్తంగా భావించే మానవీయ పరిపాలకుడు.
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏ మూల చూసినా ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ నినాదమే వినిపిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఉమ్మడిపాలనా కాలంలో తెలంగాణలో ధ్వంసమైన వ్యవసాయ రంగానికి.. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో స్వర్ణ యుగం వచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సబ్బండ వర్ణాలకు న్యాయం జరిగిందని చెప్పారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చకు మంత్రి హరీశ్రావు బుధవారం సుదీర్ఘ సమాధానం ఇచ్చారు.
సింహభాగం సంక్షేమానికే
బడ్జెట్లో సింహభాగం నిధులు పేద ప్రజల సంక్షేమం కోసమే కేటాయించినట్టు మంత్రి హరీశ్రావు తెలిపారు. బడుగు, బలహీనవర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలకు భారీగా నిధులు కేటాయించామని తెలిపారు. ఇలాంటి బడ్జెట్ను విమర్శించడం ద్వారా పేద ప్రజలకు ఏమీ చేయవద్దని ప్రతిపక్షాలు చెప్తున్నాయని విమర్శించారు.
పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేసి చూపిస్తాం
గోదావరి జలాలను సముద్ర మట్టానికి 618 మీటర్లపైకి ఎత్తిపోసిన గొప్పతనం సీఎం కేసీఆర్దేనని మంత్రి హరీశ్రావు అన్నారు. ‘సీఎం కేసీఆర్ ఏది చేసినా మనసు పెట్టి చేస్తారు. ప్రాణం పెట్టి చేస్తారు. చేసే పనిలో పూర్తిగా జీవిస్తారు. నిబద్ధతతో పరిశ్రమిస్తారు. ఆశించిన లక్ష్యాన్నే ధ్యానిస్తారు. ప్రజల ప్రయోజనాన్నే శ్వాసిస్తారు. అందుకనే విజయం సాధిస్తారు’ అని పేర్కొన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేండ్లలోనే పూర్తి చేశారని ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా చెప్పుకొంటున్నదని తెలిపారు. ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేయాల్సిన ప్రతిపక్షాలు.. కేసులు వేసి అడ్డుకొనే ప్రయత్నం చేశాయని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డికి సైతం ఇలాంటి అడ్డంకులే సృష్టించారని, అయినా పర్యావరణ అనుమతులు సాధించి, ప్రాజెక్టు పూర్తి చేసి చూపిస్తామని స్పష్టంచేశారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రూ.73,235 కోట్లు ఖర్చు చేశాం. పెరిగిన ధరల దృష్ట్యా ఇప్పుడు ఆ ప్రాజెక్టును కట్టాలంటే రూ.1.15 లక్షల కోట్లు ఖర్చవుతుంది. వేగవంతంగా పూర్తి చేయడం ద్వారా రూ.35 వేల కోట్లు ఆదా చేశాం. ప్రాజెక్టు కోసం చేసిన అప్పు గురించి మాట్లాడుతున్నవారు.. భవిష్యత్తు తరాలకు రూ.1.15 లక్షల కోట్ల ఆస్తిని సృష్టించామని మరిచిపోవద్దు’ అని హరీశ్రావు సూచించారు.
ప్రజలకు.. బీఆర్ఎస్కు.. ఫుల్ పవర్
‘తెలంగాణ తెచ్చినం కాబట్టి 2014లో అధికారంలోకి వచ్చినం. కావల్సినంత పవర్ ఇచ్చినం కాబట్టి 2018లో మళ్లా పవర్లోకి వచ్చినం. ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి పవరిచ్చిన కేసీఆర్కే మళ్లా పవరిచ్చిన్రు. ప్రతిపక్షాలవాళ్లు పవర్ హాలిడేలిచ్చిన్రు.. కాబట్టి ప్రజలు కూడా మీ పవర్కు హాలిడే ఇచ్చిన్రు. మేం ఆగకుండా పవర్ ఇస్తూనే ఉంటాం. ప్రజలు మాకు పవర్ ఇస్తూనే ఉంటరు’ అని మంత్రి హరీశ్రావు అన్నారు. ‘మేం పవర్ ఫుల్ ఇస్తే.. ప్రతిపక్ష నేతలకు తింటే పెయ్యిన పడుతలేదు, పండుకుంటే నిద్ర పడుతలేదు’ అని ఎద్దేవా చేశారు.
అదానీ సిద్ధాంతం అమలు చేస్తున్న బీజేపీ
‘బీజేపీ అంత్యోదయ సిద్ధాంతానికి నీళ్లొదిలింది. అదానీ సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నది. చిట్టచివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందించాలన్నదే అంత్యోదయ సిద్ధాంతం అయితే.. బీజేపీ వాళ్లు మాత్రం పేద ప్రజల సంక్షేమం వద్దు, కార్పొరేట్లకు దోచిపెట్టుడే ముద్దు అన్నట్టు పాలన సాగిస్తున్నారు’
అని మంత్రి హరీశ్రావు విమర్శించారు.
‘బీజేపీ అధికారంలోకి వచ్చిన 8 ఏండ్లలో బడ్జెట్లో చెప్పే థీమ్ ఒకటి.. ఆచరణలో చేస్తున్నది మరొటి. మొదటి బడ్జెట్లో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అన్నారు. ఆ సంవత్సరమంతా మూక దాడులు జరిగాయి. రెండో బడ్జెట్లో నల్లధనాన్ని అరికట్టడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు. మరుసటి సంవత్సరమే పెద్దనోట్ల రద్దు చేశారు. ఆర్థిక వ్యవస్థ చితికి పోయింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అంచనా ప్రకారం పెద్ద నోట్ల రద్దు చేసిన మొదటి నెలలోనే చిన్న పరిశ్రమలు దాదాపు రూ.1.50 లక్షల కోట్ల నష్టాన్ని చవి చూశాయి. తర్వాత రైతులకు ప్రాధాన్యత అన్నారని, మూడు వ్యవసాయ నల్ల చట్టాలు తెచ్చి, 750 మంది రైతుల ఉసురు పోసుకున్నారు’ అని విమర్శించారు.
నిరుద్యోగులు.. మీ కార్యకర్తలా?
80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ చెప్తే వరుసగా నోటిఫికేషన్లు ఇస్తున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. బీజేపీ నుంచి యువతను దూరం చేసేందుకే నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారని, నిరుద్యోగులు మీకు కార్యకర్తలుగా పనిచేయాలా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణ సమున్నత పతాకాలు
సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ నిర్మిస్తే తప్పు అన్నారని.. ఇప్పుడు ప్రారంభిస్తామంటే తేదీ మార్చాలంటున్నారని మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం పార్లమెంట్ నిర్మిస్తే ఒప్పా? సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నిర్మిస్తే తప్పా? రూ.460 కోట్లతో ప్రధాని ఇల్లు కట్టుకొంటే ఒప్పా? అని నిలదీశారు.
అద్భుతంగా ఆర్థిక ప్రగతి..
అప్పులు అప్పులు అంటూ ప్రతిపక్షాలు దుంకి దూలం అందుకొంటున్నాయని, బడ్జెట్ ప్రకారం గత ఆర్థిక సంవత్సరం మన రాష్ట్ర జీఎస్డీపీలో అప్పుల శాతం 24.7 శాతం ఉంటే, ఈసారి 23.8 శాతానికి తగ్గించామని మంత్రి హరీశ్రావు తెలిపారు. తెలంగాణ జీఎస్డీపీ పెరుగుతుంటే.. కేంద్రంలో మాత్రం జీడీపీ కన్నా అప్పులు పెరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇటీవలి బడ్జెట్లో జీడీపీలో 55.9 శాతం అప్పులు ఉంటే, ఈ ఏడాది 56.2 శాతమయ్యాయని పెరుగుతుందని చెప్పారని గుర్తుచేశారు.
స్వంత పన్ను ఆదాయం అంచనాల్లో 2017-18 నుంచి సగటున 90.3 శాతం సాధించాం. 2017-18లో 90 శాతం, 2018-19లో 87 శాతం, 2019-20లో 97.5 శాతం, 2020-21లో కొవిడ్ వల్ల 78.1 శాతం, 2021-22లో 98.2 శాతం సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసినట్టుగానే 100 శాతం ఆదాయం వచ్చింది.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మిగులులోనే ఉన్నాం. 2014-15లో రూ.369 కోట్లు, 2015-16లో రూ.238 కోట్లు, 2016-17లో రూ.1,386 కోట్లు, 2017-18లో రూ.3,459 కోట్లు, 2021-22లో రూ.4,337 కోట్లు మిగులులో ఉన్నాం. కొవిడ్ కారణంగా 2018-19, 2019-20, 2020-21లో మాత్రమే మైనస్లోకి వెళ్లాం.
కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో మాత్రం భారీగా వ్యత్యాసం కనిపిస్తున్నది. కేంద్రం నుంచి తెలంగాణకు రూ.1,27,109 కోట్లు రావాల్సి ఉన్నది. వాటిని రాష్ట్ర బీజేపీ నేతలు తీసుకురావాలి.
బడ్జెట్లో ఏమున్నదంటే..
‘ముసలవ్వలకు రక్షణ ఉన్నది, పసి పిల్లలకు పోషణ ఉన్నది, బడి పిల్లలకు శిక్షణ ఉన్నది, ఉన్నత విద్యకు ఉపకారం ఉన్నది, యువతకు ఉద్యోగ కల్పన ఉన్నది. ఆరిపోని కరెంటు వెలుగులున్నాయి, నదీ జలాలను ఎత్తిపోసిన విజయాలున్నాయి, మత్తడి దుంకుతున్న చెరువుల తళతళలున్నాయి, చెరువులో చేప పిల్లల మిలమిలలున్నాయి, జలరాసుల గలగలలున్నాయి, ధాన్య రాసుల కళకళలున్నాయి, రైతుల ముఖాల మీద చిరునవ్వులున్నాయి, గొర్ల మందల అరుపులున్నాయి, గొల్ల కుర్మల కండ్లల్ల మెరుపులున్నాయి. నేతన్నకు భరోసా ఉన్నది, గీతన్నకు కులాసా ఉన్నది, దళితబంధు ఇచ్చే దిలాసా ఉన్నది, ఆకుపచ్చని అడవులున్నాయి,
మళ్లా ఊపిరి పోసుకున్న పక్షి జాతులున్నాయి, కాలుష్యం మీద కదనం ఉన్నది, పర్యావరణ సమతుల్యం ఉన్నది, పేదింటి ఆడబిడ్డల పెండ్లి పందిర్లున్నాయి, వారి తల్లిదండ్రుల కండ్లల్లో ఆనంద బాష్పాలున్నాయి, కంటివెలుగు కాంతి ఉన్నది, ప్రతి హృదయంలో శాంతి ఉన్నది, కొత్త దవాఖానలున్నాయి, జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్నది, పెరిగిన బెడ్లు ఉన్నాయి, చికిత్స మార్గం ఉన్నది, ఆరోగ్య భాగ్యం ఉన్నది, సబ్బండ వర్ణాల సంక్షేం ఉన్నది, సకల జనుల సౌభాగ్యమున్నది, సమీకృత, సమ్మిళిత, సమగ్ర, సుస్థిర అభివృద్ధి ఉన్నది’ అని బడ్జెట్ గురించి మంత్రి హరీశ్రావు వివరించారు.
మిషన్ కాకతీయ విజయం
ప్రజలు సృష్టించిన సాంప్రదాయ సాగునీటి వ్యవస్థలను పాలకులు నాశనం చేస్తున్న తీరును అనిల్ అగర్వాల్ అనే రచయిత ‘డైయింగ్ విజ్ డమ్’ అనే పేరుతో పుస్తకం రాశారని, ఆయన బతికి ఉంటే.. సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయతో చేపట్టిన పనులను చూసి ‘రిజువనేటింగ్ విజ్ డమ్ ఆఫ్ తెలంగాణ’ (తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ) అని పుస్తకం రాసి ఉండేవారని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఒకప్పుడు పెద్ద వాన పడితే వరుసగా 40-50 చెరువులు తెగిపోయేవని, కొన్నేండ్ల కిందట 500 ఏండ్లలో పడనంత పెద్దవానలు పడ్డా కట్టలు తెగలేదని, ఇది మిషన్ కాకతీయ సాధించిన విజయమని పేర్కొన్నారు.
కృష్ణా నదిలో వాటా తేల్చండి
రాష్ట్రం ఏర్పడిన పది పదిహేను రోజుల్లోనే కృష్ణా జలాల్లో నీటి వాటా తేల్చాలని సీఎం కేసీఆర్ స్వయంగా నాటి జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారని, ఏడాది గడిచినా తేల్చకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లామని హరీశ్ గుర్తుచేశారు.
‘ప్రస్తుత జల్శక్తిశాఖ మంత్రి విజ్ఞప్తి మేరకు.. సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకున్నాం. చెప్తున్నది కేంద్రమంత్రి.. చెప్పింది ముఖ్యమంత్రికి కదా అని నమ్మినం. పది నెలలైనా ఇప్పటికీ పరిష్కరించలేదు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కృష్ణా జలాల వాటాను తేల్చాలి’ అని డిమాండ్ చేశారు. మరికొన్ని రోజులు ఎదురుచూసి మరోసారి సుప్రీంకోర్టులో కేసు వేస్తామని తెలిపారు.
ఏక్ హీ ఆవాజ్.. కిసాన్ సర్కార్
‘చేపలు ఆరబెట్టుకోవడానికి కల్లాలు కడితే బీజేపీకి ఒప్పట.. తెలంగాణలో రైతులు ధాన్యం ఆరబెట్టుకోవడానికి కల్లాలు కడితే తప్పట’ అని కేంద్రంపై మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కల్లాల కోసం వినియోగించిన రూ.151 కోట్లు వాపస్ ఇచ్చేదాకా రాష్ర్టానికి రావాల్సిన ఉపాధి హామీ నిధులు ఆపారని విమర్శించారు. ‘రైతుకు చింతాకంత మేలుచేసినా వీళ్లకు చిర్రెత్తుకొస్తున్నది’ అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు దీనిని చూస్తూ ఊరుకోరని, బీజేపీకి పుట్టగతులు లేకుండా చేస్తారని హెచ్చరించారు. ‘రైతుల గుండెల్లో మంటలు రేపేది మీ సర్కారైతే.. రైతుల్ని గుండెల్లో పెట్టి చూసుకొనేది మా సర్కారు. అందుకే దేశంలో ఇప్పుడు కొత్త నినాదం పుట్టింది. పూరబ్- పశ్చిమ్ – ఉత్తర్ – దక్షిణ్ – ఏక్ హీ ఆవాజ్.. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్. దేశం మొత్తం తెలంగాణ తరహా రైతు రాజ్యం కావాలని నినదిస్తున్నది’ అని పేర్కొన్నారు.
తెలంగాణలో సాగుకు స్వర్ణయుగం
తెలంగాణలో సాగుకు స్వర్ణయుగం వచ్చిందని మంత్రి హరీశ్రావు తెలిపారు. ‘ఇప్పుడు రైతులకు కాలమైతదా, కాదా అనే ఫికర్ లేదు. కరెంటు ఉంటదా ఉండదా? అనే ఆందోళన లేదు. అప్పు పుడుతదా, పుట్టదా? అనే అనుమానం లేదు. పంటను కొంటరా, కొనరా? అనే పరేషాన్ లేదు’ అని పేర్కొన్నారు. వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం ఎనిమిదిన్నరేండ్లలో రూ.1.92 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో దశాబ్దకాలంలో రైతుల కోసం కేటాయించిన బడ్జెట్కన్నా ఇది 20 రెట్లు అధికమని చెప్పారు. ‘ఇప్పుడు తెలంగాణలో పండిన ధాన్యాన్ని నింపేందుకు సంచులు సరిపోతలేవు, మోయడానికి హమాలీలు దొరుకుతలేరు, ఎత్తిపోసేటందుకు కూలీలు సరిపోతలేరు, ధాన్యం లారీలు రయ్.. రయ్ అని తిరుగుతున్నయి, ఊరూరా ట్రాక్టర్లు.. హార్వెస్టర్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది, ఉన్న రైస్ మిల్లులు సరిపోతలేవు, కొత్త రైసు మిల్లులు వెలుస్తున్నయి, వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయమిది’ అని పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగ వృద్ధిరేటు జాతీయ వృద్ధిరేటు కన్నా రెండు రెట్లు ఉన్నదని, కాంపౌండ్ ఆన్యువల్ గ్రోత్ రేట్లో దేశంలోనే మూడో స్థానంలో నిలిచామని చెప్పారు.
నీళ్ల గోస తీర్చినం
ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో రాష్ట్రంలో తాగునీటి సమస్యను పరిష్కరించారని మంత్రి హరీశ్రావు తెలిపారు. గతంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే ఖాళీ బిందెలతో ర్యాలీలు ఉండేవని, సభలో మొదటి తీర్మానం తాగునీటి సమస్య మీదే ఉండేదని గుర్తు చేశారు. ‘బీఆర్ఎస్ పాలనలో ఇన్నేండ్లలో ఒక్కరోజైనా ప్రతిపక్ష నేతలు తాగునీటి సమస్య గురించి సభలో మాట్లాడలేదు. వాయిదా తీర్మానం అడగలేదు. ఖాళీ బిందెల ప్రదర్శన జరగలేదు. దీనిని బట్టే రాష్ట్రంలో తాగునీటి సమస్య లేదని ప్రతిపక్షాలే అంగీకరించాయి’ అని తెలిపారు. ఇటీవల మరణించిన ఫ్లోరైడ్ వ్యతిరేక ఉద్యమకారుడు అంశాల స్వామికి మంత్రి హరీశ్రావు నివాళులు అర్పించారు. ‘అంశాల స్వామి మీ వైఫల్యానికి కన్నీటి ప్రతీక అయితే.. మా విజయ ప్రతీక’ అని విపక్షాలను ఎద్దేవా చేశారు. ‘మీ పరిపాలన ప్రజల బతుకుల మీద ఫ్లోరైడ్ బండ.. మా పరిపాలన స్వచ్ఛమైన భగీరథ నీళ్లు నిండిన చల్లని కుండ’ అని స్పష్టం చేశారు. కేంద్ర పాలకులకు ఇది అమృత్ కాల్ అని.. దేశ ప్రజలకు మాత్రం కనీసం తాగునీరు కూడా దొరకని ఆపద కాలమని ఆవేదన వ్యక్తంచేశారు.
వైద్య రంగంలో అద్భుత విజయాలు
ఆరోగ్యశ్రీ నడవడం లేదనడం సరికాదని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆరోగ్యశ్రీని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచామని గుర్తుచేశారు. అవయవ మార్పిడి వంటివాటికి రూ.10 లక్షలు అందిస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసిందని, 21.50 లక్షల మంది ఆరోగ్యశ్రీ సేవలు పొందారని వివరించారు. మాతృమరణాలు లక్షకు 70 కన్నా తక్కువ ఉండాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తే, తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాల వల్ల 43కు తగ్గించామని, తద్వారా దేశంలో మూడో స్థానంలో ఉన్నామని చెప్పారు. కేంద్ర ఎకనమిక్ సర్వే 2023లో ప్రభుత్వ రంగంలో వైద్యసేవలు అందించడంలో తెలంగాణ మూడో స్థానంలో , ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో ఉన్నదని తెలిపిందన్నారు.
అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలలు
ప్రైవేట్ విద్యాసంస్థలను తలదన్నేలా గురుకులాలను తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి హరీశ్రావు తెలిపారు. గురుకులాల్లో చదివిన విద్యార్థులు ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు పొందుతున్నారని, ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతున్నారని చెప్పారు. గతంలో రెసిడెన్షియల్ స్కూళ్లు 10వ తరగతి వరకే ఉండేవని, ఇప్పుడు అన్నీ ఇంటర్కు అప్గ్రేడ్ చేశామని, కొన్నింటిని డిగ్రీ, పీజీకి కూడా చేర్చామని పేర్కొన్నారు. మన ఊరు – మన బడితో సర్కారు బడులన్నీ సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయని చెప్పారు. రెండో దశ కోసం నాబార్డ్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఫండ్ నుంచి మొత్తంగా రూ.2,580 కోట్లు కేటాయించామని తెలిపారు. యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.500 కోట్లు పెట్టామని వివరించారు.
రైతుపై కేంద్రం కక్ష.. నిధుల్లో కోత
ప్రధాని చేత క్షమాపణలు చెప్పించారని రైతులపై కేంద్ర ప్రభుత్వం కక్ష పెంచుకొన్నదని మంత్రి హరీశ్రావు విమర్శించారు. తాజా కేంద్ర బడ్జెట్లో రైతు అనే మాట కనిపిస్తే చాలు నిధుల్లో కోతపెట్టిందని మండిపడ్డారు. ఎరువుల సబ్సిడీలో రూ.50 వేల కోట్లు తగ్గించారని, ఫసల్ బీమా యోజనకు రూ.1,875 కోట్లు, కిసాన్ సమ్మాన్ నిధికి రూ.8 వేల కోట్లు, ఆర్కేవీవైకి రూ.3,200 కోట్లు, ఫుడ్ సబ్సిడీలో రూ.90 వేల కోట్లు తగ్గించారని గుర్తుచేశారు. పత్తి కొనుగోలు కోసం సీసీఐకి గత ఏడాది రూ.9,240 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.లక్ష మాత్రమే ఇచ్చారని, దీనిని బట్టి పత్తి కొనుగోలు నుంచి కేంద్రం తప్పుకొంటున్నదనే అనుమానం కలుగుతున్నదని అన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్కు గతంలో రూ.1,500 కోట్లు ఇస్తే.. ఇప్పుడు కేవలం రూ.లక్ష ఇచ్చారని విమర్శించారు. ఇలాంటి బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రభుత్వానికి సుద్దులు చెప్తే అర్హత ఉన్నదా? అని ప్రశ్నించారు. ‘ఆత్మ నిర్భర్ భారత్ అని మీలాగా డబ్బా కొట్టుకోవడం కాదు. దుర్భర స్థితిలో ఉన్న రైతులు ఆత్మ నిర్భరతతో బతికే స్థితికి మేం తెచ్చినం’ అని బీజేపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కార్పొరేట్లకు పన్ను తగ్గించి, పేదలకు ఒక్క రూపాయి కూడా తగ్గించలేదని విమర్శించారు.
కేంద్రం తప్పులు.. రాష్ర్టాలకు సుద్దులు
కేంద్ర ప్రభుత్వం 2018లో ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని సవరించి 2021 మార్చి 31 నాటికి ద్రవ్యలోటును జీడీపీలో 3 శాతానికి తగ్గిస్తామని చట్టం చేశారని, తాజా బడ్జెట్లో 6.3 శాతంగా చూపారని మంత్రి హరీశ్రావు తెలిపారు. జీడీపీలో అప్పులను 2024-25 నాటికి 40 శాతానికి తగ్గిస్తామని చెప్పినా, తాజా బడ్జెట్లో 56.2 శాతంగా చూపారని విమర్శించారు. కేంద్రం తీసుకొన్న అప్పుల్లో 46 శాతం రోజువారీ ఖర్చులకు వాడుతున్నారని, ఇది కేంద్ర ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. రాష్ట్ర జీఎస్డీపీలో అప్పులతో పోల్చితే కేంద్రం అప్పులు రెట్టింపునకుపైగా ఉన్నాయని, అయినా రాష్ర్టాలకు నీతులు చెప్తున్నారని మండిపడ్డారు. కేంద్రం గంటకు రూ.192 కోట్ల చొప్పున.. నెలకు రూ.లక్ష కోట్ల అప్పు చేస్తున్నదని విమర్శించారు. నెలకు రూ.2,959 కోట్లు మిత్తి కడుతున్నదని, మోదీ సర్కారు దేశ ప్రజలపై మోపిన తలసరి అప్పు రూ.1,39,950 అని చెప్పారు.
తంత్రాలైనా.. కుతంత్రాలైనా.. బీజేపీకే అలవాటు
రాష్ట్ర, కేంద్ర బీజేపీ నేతలకు ప్రజల కోణంలో విమర్శించేందుకు ఏమీ లేక ‘తాంత్రిక పాలన’ అంటూ పిచ్చిపిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని హరీశ్రావు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఏం చేసినా భగవంతుడిని పూజిస్తారని చెప్పారు. కొత్త జిల్లాలకు రాజన్న సిరిసిల్ల, జోగులాంబ గద్వాల, భదాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి అని దివ్య క్షేత్రాల పేర్లు పెట్టారని గుర్తుచేశారు. శ్రామిక కులాలు ఆరాధించే కొమురవెల్లి మల్లన్న పేరున మల్లన్న సాగరం, కొండపోశవ్వ తల్లి పేరున కొండపోచమ్మ సాగరం అని పేర్లు పెట్టి కొండంత భక్తిని చాటిన సంస్కృతీ పరిరక్షకుడని కొనియాడారు. బరాజ్లకు సమ్మక్క, సారలమ్మ, సీతారామ, అన్నపూర్ణ, లక్ష్మి, పార్వతి, సరస్వతి.. ఇలా దేవీ, దేవతల పేర్లు పెట్టిన ఆధ్యాత్మిక గుణ సంపన్నుడు సీఎం కేసీఆర్ అని శ్లాఘించారు. ఎన్ని చేసినా భక్తితో, విశ్వాసంతో చేశారే తప్ప ఓట్ల రాజకీయాల కోసం చెయ్యలేదని స్పష్టంచేశారు. ఫాం హౌజ్లో తాంత్రిక పూజలు కాదని, కపిల గోవుకు గోపూజ చేస్తారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం బనారస్ వర్సిటీలో పెట్టినట్టుగా ఇక్కడ చేతబడి కోర్సు పెట్టలేదని అన్నారు.
నాడు – నేడు..
‘మడుగులన్ని అడుగంటి పోయినయి..
బావులు సావుకు దగ్గరయినయి..
వాగులు వంకలు ఎండిపోయినయి..
సాకలి పొయ్యిలు కూలిపోయినయి..
పొద్దంత నడిచేటి పెద్ద బోరు కూడా గుక్కెడు నీళ్లకు నోచుకోకపాయే’ అని నాటి పరిస్థితులపై కవి గోరటి వెంకన్నపాట రాశారు.
‘ఎండకాలంలో కూడా మత్తళ్లు దుంకే చెరువులు..
మండుటెండల్లో అలుగువారుతున్న చెక్ డ్యాంలు..
నిండుకుండలోలె బావులు, పండు వెన్నెలోలె పల్లెలు..’
మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెక్డ్యామ్ల ఫలితంగా భూగర్భజలాలు పైకి వచ్చాయి.
బోర్లు ఉబికి వస్తున్నయి.. బాయిలు ఎల్లబోస్తున్నయి.
డబుల్ ఇంజినా.. డబుల్ ఇంపాక్టా?
ఇటీవల బాసర పోయినప్పుడు మహారాష్ట్ర సరిహద్దుల్లో రోడ్డకు అడ్డంగా పైపులైన్లు కనిపించాయి. ఇదేంటని ఎమ్మెల్యే విఠల్రెడ్డిని అడిగితే డబుల్ ఇంజిన్ సర్కారున్న మహారాష్ట్రలో అర్ధరాత్రి కరెంటు వస్తున్నది. తెలంగాణలో ఉచిత కరెంటుతోపాటు రైతుబంధు, రైతుబీమా ఇస్తుండటంతో ఇక్కడ భూమి కొనుక్కొని బోర్ వేసుకొని మహారాష్ట్రపొలాలకు నీళ్లు పారించుకొంటున్నరని చెప్పారు. తెలంగాణ ప్రగతికి ఇదే సాక్ష్యం. మీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం బాగున్నదా? మా డబుల్ ఇంపాక్ట్ ప్రభుత్వం బాగున్నదా?
-హరీశ్రావు
ఏక్ హీ ఆవాజ్.. కిసాన్ సర్కార్
చేపల కోసం కల్లాలు కడితే బీజేపీకి ఒప్పట.. రాష్ట్రంలో రైతులు ధాన్యం ఆరబెట్టుకోవడానికి కల్లాలు కడితే తప్పట! కల్లాలకు ఖర్చు చేసిన రూ.151 కోట్లు వాపస్ ఇచ్చేదాకా ఉపాధి నిధులు ఆపారు. రైతుకు చింతాకంత మేలుచేసినా వీళ్లకు చిర్రెత్తుకొస్తున్నది. అందుకే ఇప్పుడు కొత్త నినాదం పుట్టింది. పూరబ్- పశ్చిమ్ – ఉత్తర్ – దక్షిణ్ ఏక్ హీ ఆవాజ్.. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్.
రాష్ట్ర బీజేపీ నేతలు కవిలు
బీజేపీ, కాంగ్రెస్ నేతలు ‘కవి’లా మారారు.
క- అంటే కనబడదు, వి- అంటే వినబడదు.
బీజేపీ ధోఖాలు..
వీటిల్లో బీజేపీ సక్సెస్