సిద్దిపేట : తుఫాన్ ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ప్రభుత్వం మాత్రం రోజుల తరబడి వడ్లు కొనకపోవడం వల్ల వడ్లు తడిచే అవకాశం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని(Chinna koduru) ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(Grain purchasing center) సందర్శించి మీడియాతో మాట్లాడారు.
ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు కల్లాల్లో పడిగాపులు కాచే పరిస్థితి ఏర్పడింది. తడిసిన వడ్లతో సహా అన్ని వడ్లను కొంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉందన్నారు. చిన్నకోడూరు కేంద్రాల్లో రైతులు 20 రోజులుగా వేచి చూస్తున్నారని చెప్పారు. ధాన్యం ఒకటికి రెండుసార్లు తడిసి మొలకెత్తింది. ధాన్యం రైస్ మిల్లుకు వెళ్లాక తేమ శాతం ఎక్కువ ఉందని, మొలకెత్తిందని కొనడం లేదని పేర్కొన్నరు. ఒక వేళ కొన్నా తరుగు తీసేయడం వల్ల సంచికి మూడు కిలోలు కోతపెట్టే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.
తరుగు లేకుండా వెంటనే వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. చిన్నకోడూరు రైతులతో మాట్లాడినప్పుడు ఇంటి అవసరాలకు మాత్రమే సన్న వడ్లు పండిస్తామని, మిగతా వడ్లన్నీ దొడ్డువడ్లేనని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేవలం సన్నవడ్లకే ఇస్తామనడం రైతులను మోసం చేయడమేనని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో 3,38,389 ఎకరాల్లో వరి సాగయింది. 3 లక్షల 29 వేల ఎకరాల్లో దొడ్డు రకం వేశారు. 16 వేల ఎకరాల్లో మాత్రమే సన్నరకం వేశారు.
రూపాయికి 95 శాతం దొడ్డువడ్లు పండించే వాళ్లకు బోనస్ ఎగ్గొట్టి , కేవలం ఐదు శాతం సన్నబడ్లు పండించే వాళ్లకు బోనస్ ఇస్తామనడం రైతులను దగా చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తానాల కోసం రైతుల పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి వేచి చూసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులు కల్లాల్లో తిరిగేవాళ్లు. ఇప్పుడు ఒక్క మంత్రి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడం లేదని విమర్శించారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్న విషయం తెలుసుకోవడానికి మంత్రులు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని డిమాండ్ చేశారు.