సీఎంగారూ కాంగ్రెస్లో చేరికల మీద కాదు.. రైతుల కన్నీటి చారికలపై దృష్టి పెట్టండి. నష్టపోయిన రైతుల వివరాలు సేకరించండి. ప్రకృతి వైపరీత్యాల సాయానికి ఎన్నికల కోడ్ అడ్డుకాదు
-హరీశ్
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నదని, అకాల వర్షాలతో ఓ వైపు రైతులు తీవ్రంగా నష్టపోతే, మరోవైపు పంట రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్లు నోటీసులు పంపిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు పంటరుణాలు చెల్లించాల్సిన పనిలేదని, తాము అండగా ఉండి ప్రభుత్వం మెడలు వంచుతామని పేర్కొన్నారు. వడగండ్ల వర్షాలతో ఓ వైపు పంటలు నష్టపోతే, మరోవైపు సాగునీరు, కరెంటు లేక మరోవైపు పంటలు ఎండిపోతున్నాయని, అయినప్పటికీ ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు అయినా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్తో కలిసి హరీశ్రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి ఎకరానికి రూ. 25 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ తరపున పోరాడతామని భరోసా ఇచ్చారు.
మ్యానిఫెస్టోలోని ఒక్క హామీ అయినా నెరవేర్చారా?
ఆదివారం వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం లక్ష్మీబాయితండాలో పర్యటించి రైతులతో మాట్లాడితే వారి దయనీయ పరిస్థితులు తెలిశాయని హరీశ్రావు చెప్పారు. గ్రామంలో ఒక్కో రైతు నాలుగు నుంచి 8 బోర్ల వరకు వేసి లక్షల్లో అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్లు వేసేందుకు, పూడికలు తీసేందుకు బోర్ యంత్రాలు, క్రేన్లను తెప్పించుకుంటున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. తండాల్లోకి తాగునీరు కూడా సరిగా రావడం లేదని చెప్పారు. మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని ప్రకటించారని, రైతుబందు కింద ఎకరానికి రూ.15 వేలు, క్వింటాల్ వరికి రూ.500 ప్రోత్సాహకం, కౌలు రైతులకు రైతుబంధు అమలు చేస్తామన్నాని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అమలు చేయలేదని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని రైతులను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రికి, మంత్రులకు సమయమే దొరకడం లేదని ఎద్దేవా చేశారు. పంటనష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులను కూడా క్షేత్రస్థాయికి పంపించడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని తమకు ప్రాథమిక సమాచారం ఉందని, ఇప్పటి వరకు 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.
బ్యాంకు అధికారులా.. రజాకార్లా?
రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్తూ రైతులకు బ్యాంకు అధికారులు నోటీసులు పంపిస్తున్నారని హరీశ్రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా రేగోడు మండలంలో ఏపీజీవీబీ బ్యాంకు అధికారులు రుణాలు చెల్లించాలంటూ రైతులకు లీగల్ నోటీసులు పంపించారని తెలిపారు. గ్రామాల్లోకి వెళ్లి బకాయిలు కట్టాలని రైతులను వేధిస్తున్నారని, కట్టకుంటే ఆస్తులు సీజ్ చేస్తాం, కోర్టుకు లాగుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికారుల్లా కాక రజాకార్లలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9న రుణమాఫీపై తొలి సంతకం పెడతానని ప్రకటించిన రేవంత్రెడ్డి రైతులను దగా చేశారని విరుచుకుపడ్డారు. పార్టీ గేట్లు తెరవడంపై రేవంత్కు ఉన్న శ్రద్ధ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంపై లేదని విమర్శించారు. ప్రతిపక్ష నేతల ఇండ్లలోకి వెళ్లి రేవంత్రెడ్డి బతిమలాడి వారికి కండువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నేత లంచాలకు రైతన్న బలి
జనగామ నియోజకవర్గంలోని బచ్చన్నపేటలో కాంగ్రెస్ నేతల లాంచాలకు ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. ధరణి లో మార్పులు అంటూ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 95 శాతం పట్టాలు, 1.55 కోట్ల ఎకరాలకు గతంలోనే పట్టాలు ఇచ్చామని తెలిపారు. రైతులకు భూమి హక్కులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ అనేది సెంటిమెంట్ కాదని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు ఎదుర్కొన్న కష్టాల కారణంగానే ఉద్యమం వచ్చిందని తెలిపారు. రైతు సమస్యలపై మాట్లాడితే కాంగ్రెస్ నేతలకు సెంటిమెంట్ గా కనిపిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ వాదం, రైతుల సమస్యలను సెంటిమెంట్ అనేవాళ్ళు సెంటి ‘మెంటల్గాళ్లు’ అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతుల కేంద్రంగా నడిస్తే.. ప్రస్తుత ప్రభుత్వానికి రైతుల ధ్యాసే లేదని మండిపడ్డారు.
నేటి నుంచి పంట పొలాల సందర్శన
రాష్ట్రంలోని రైతుల పరిస్థితిపై పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు సోమవారం పార్టీ ముఖ్యనాయుకులతో మాట్లాడారని, రైతుల పొలాలు సందర్శించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారని హరీశ్రావు తెలిపారు. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను, కరెంటు, నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పరిశీలిస్తారని తెలిపారు. గ్రామాలు, రైతుల వారీగా జరిగిన నష్టం అంచనాలను బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి పంపించాలని, ఆ నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు.
సచివాలయాన్ని ముట్టడిస్తాం
రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వకుంటే లక్షలాదిమంది రైతులతో సచివాలయాన్ని ముట్టడిస్తాం. వరి మద్దతు ధరకు అదనంగా రూ. 500 బోనస్ ఇవ్వాల్సిందే. తప్పించుకోవాలని చూస్తే కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తాం. రైతులు ధైర్యంగా ఉండండి. ఆత్మహత్యలు వద్దు.
-హరీశ్రావు
మోసం చేసినందుకు ఓట్లు అడుగుతరా?
బాండు పేపర్లు రాసిచ్చి రైతులను మోసం చేసినందుకు ఓట్లు అడుగుతరా? పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా 20 ఎకరాల్లో పంటలు ఎండబెట్టినందుకు ఓట్లు అడుగుతరా? నీటి నిర్వహణలో వైఫల్యం చెందినందుకు, కరెంటు సరిగా ఇవ్వలేకపోయినందుకు, మోటార్లను కాలబెటినందుకు ఓట్లు అడుగుతరా?
-హరీశ్రావు
దగా కాంగ్రెస్