హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): మాటల్లో కోతలు.. ఉద్యోగుల వేతనాల్లో కోతలు ఇదేనా రేవంత్రెడ్డి ప్రజాపాలన? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు ప్రశ్నించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు శనివారం హరీశ్రావును ఆయన నివాసంలో కలిశారు. ప్రభుత్వం తమ వేతనాల్లో కోతలు విధిస్తున్నదని, న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 20-25 ఏండ్లుగా సేవలందిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 1181 ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాలిట శాపంలా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 31వేల ఉద్యోగుల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతున్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో వేతనాలు పెంచితే కాంగ్రెస్ పాలనలో కోతలు పెట్టడం శోచనీయమని మండిపడ్డారు. వెంటనే జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. చేతల్లో మాత్రం చార్జీల మోత మోగిస్తున్నదని హరీశ్రావు ధ్వజమెత్తారు. అడ్డగోలుగా ఆర్టీసీ టికెట్ల ధరల పెంపుపై శనివారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రయాణికులు పంపిన బస్ టికెట్ను ఎక్స్లో షేర్ చేస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. హైదరాబాద్-హనుమకొండ ఏసీ బస్సు చార్జీ ఆగస్టు 20న రూ.410 ఉంటే.. సెప్టెంబర్ 11న ఏకంగా రూ.570కి పెంచారు.. అంటే కేవలం 20 రోజుల వ్యవధిలో ఒక్కో ప్రయాణికుడిపై రూ.160 అదనపు భారం మోపిందని ఆరోపించారు. ఇది ప్రజాపాలన కాదు.. దోపిడీ పాలన అని విరుచుకుపడ్డారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.