Harish Rao | ఒకవైపు యూరియా కొరతతో రాష్ట్ర రైతాంగం అల్లకల్లోలం అవుతుంటే అధికార పక్షం దాన్ని ప్రతిపక్షాల దుష్ప్రచారంగా చెప్పడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు దొంగే.. దొంగ దొంగ అన్నట్లుందని మండిపడ్డారు. కుండపోత వానలో తడుస్తూ రైతులు గంటల కొద్దీ నిలబడటం అబద్దమా అని మండిపడ్డారు.
ఆధార్ కార్డులు, పాస్ బుక్కులు, చెప్పులు క్యూలైన్లలో పెట్టడం అబద్దమా అని హరీశ్రావు ప్రశ్నించారు. యూరియా బస్తాలు ఇవ్వాలంటూ రైతన్నలు అధికారుల కాళ్లు పట్టుకొని వేడుకున్నది అబద్దమా? దేశానికి అన్నం పెట్టే రైతన్న యూరియా అడిగితే పోలీసు లాఠీలతో కొట్టించింది అబద్దమా? కాంగ్రెస్ ఎంపీల యూరియా పోరాటం ఫలించిందని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గనిపిస్తలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేతగాని తనం వల్లనే కదా ఈరోజు రైతులకు ఇన్ని కష్టాలు వచ్చిందని తెలిపారు. ఈ ముఖ్యమంత్రికి ముందు చూపు లేకపోవడం వల్లనే కదా రైతులు కన్నీళ్లు పెట్టాల్సి వస్తున్నదని మండిపడ్డారు.
తులం బంగారం ఇస్తామంటూ ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి, బంగారం మాట దేవుడెరుగు యూరియానే బంగారంగా మార్చిండని హరీశ్రావు విమర్శించారు. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులైపారిస్తున్న రేవంత్ రెడ్డి, యూరియా బస్తాలను అందుబాటులో ఉంచడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యిండని మండిపడ్డారు. బూటకపు వాగ్దానాలు చేసినంత సులువు కాదు, పరిపాలన చేయడం అంటే అని ఎద్దేవా చేశారు. నమ్మి నయవంచన చేసినంత సులువు కాదు, కేసీఆర్ అందించిన రైతు సంక్షేమాన్ని కొనసాగించడం అంటే అని పేర్కొన్నారు. నాటి రోజులు తెస్తామని పదే పదే చెప్పే రేవంత్ రెడ్డి..అన్నమాట నిలుపుకుంటున్నడని.. మల్లా కాంగ్రెస్ దుర్మార్గ పాలన నాటి పాత రోజులను తీసుకొచ్చిండని మండిపడ్డారు.
తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఏనాడూ యూరియా కొరత రాలేదని హరీశ్రావు అన్నారు. ఏనాడూ రోడ్డెక్కాల్సిన దుస్థితి రాలేదని గుర్తుచేశారు. యూరియా కొరతకు కారణమైన వారే ఈరోజు యూరియా పేరు చెప్పి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. మిస్ వరల్డ్ పేరిట రెండు నెలలు పాలనను గాలికి వదిలేసిండు తప్ప, ఎరువులు, విత్తనాల గురించి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు చేయలేదని.. బాధ్యత లేదు, ప్రణాళిక లేదు, కార్యచరణ లేదని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్నాం, బాధ్యతగా ఉండాలనే సోయి కూడా లేకుండా ప్రతి వైఫల్యాన్ని బీఆర్ఎస్, కేసీఆర్ పై వేస్తూ రంకెలేయడం తప్ప 22 పాలనలో ఒరగబెట్టిందేమిటి అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే, ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి చేతగాని తనం వల్లనే రాష్ట్రానికి ఎరువుల కొరత వచ్చిందని హరీశ్రావు విమర్శించారు. ఈరోజు యావత్ రైతాంగాన్ని యూరియా కోసం నడి రోడ్డుపై నిలబెట్టిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది సాగు నీళ్లు ఇవ్వడంలో ఫెయిల్, పంట కొనుగోళ్లలో ఫెయిల్, 500 బోనస్ ఇవ్వడంలో ఫెయిల్, రైతు భరోసా ఇవ్వడంలో ఫెయిల్, రైతు రుణమాఫీలో ఫెయిల్, చివరకు యూరియా సరఫరా చేయడంలో ఫెయిల్ అని విమర్శించారు. రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న ఈ ప్రభుత్వం ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వమని మండిపడ్డారు.
దేశానికి అన్నం పెట్టే రైతుల చేతులతో కాళ్లు మొక్కించుకుంటున్న ఈ ప్రభుత్వానికి తప్పకుండా ఉసురు తగులుతుందని అన్నారు. రైతులను కాళ్లు పట్టుకునే దుస్థితికి తెచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల మీద నిందలు మాని, రైతుల యూరియా కష్టాలపై ఇప్పటికైనా దృష్టి సారించాలని హితవు పలికారు. యూరియా, ఎరువుల కొరత పై సమీక్ష నిర్వహించి, రైతాంగానికి అవసరమైన యూరియా వెంటనే సరఫరా చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.