హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని, ముఖ్యమంత్రిగానే కాకుండా హోంమంత్రిగా కూడా రేవంత్రెడ్డి విఫలమయ్యారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. 2024 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందన్న వాస్తవాన్ని బయటపెట్టాయని తెలిపారు. దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు నమోదవుతున్న రాష్ట్రంగా తెలంగాణ మారడం ఆందోళనకరమని పేర్కొన్నారు. 2024లో తెలంగాణలో 27,230 సైబర్ నేరాలు నమోదయ్యాయని, ప్రస్తుతం ఆ నేరాల సంఖ్య 49 శాతం పెరుగడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వెల్లడించారు. దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు నమోదవుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా మారిందని పేర్కొన్నారు. 2024లో తెలంగాణలో 25,500 మిస్సింగ్ కేసులు నమోదవగా, వేలాదిమంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదని పేర్కొన్నారు. రోజూ సగటున ఆరుగురు చిన్నారులు అదృశ్యమవుతున్న పరిస్థితి నెలకొనడం దారుణమని మండిపడ్డారు. చిన్నారులపై నేరాలు భారీగా పెరిగాయని వాపోయారు. 2024లో రాష్ట్రంలో చిన్నారులపై నేరాల కేసులు 6,767 నమోదయ్యాయని, కిడ్నాప్నకు గురైన చిన్నారుల్లో అధిక శాతం బాలికలేనని చెప్పారు. మహిళలపై నేరాలు పెరిగాయని, 2022లో 22,066 కేసులు ఉంటే 2024లో అవి 24,495కు పెరిగాయని శుక్రవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు.
మానవ అక్రమ రవాణా కేసుల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం రాష్ట్ర పోలీస్ వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 2024లో 423 మానవ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాగ్నిజబుల్ (తీవ్రమైన) నేరాలు భారీగా పెరిగాయని తెలిపారు. 2022లో 1,65,830 కేసులు ఉండగా, 2024 నాటికి అవి 2,17,976కు చేరుకున్నాయని పేర్కొన్నారు. ప్రతి లక్ష జనాభాకు తెలంగాణలో నేరాల రేటు 568.9గా ఉండగా, దేశ సగటు 418.9 మాత్రమే ఉండటం రాష్ట్రంలో శాంతిభద్రతల లోపాన్ని వెల్లడిస్తున్నదని తెలిపారు. కరీంనగర్ నగల దుకాణం దోపిడీ ఘటనలో నిందితులను పట్టుకోలేకపోవడం కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శమని తెలిపారు. పట్టపగలు, ప్రజల ముందే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని, ఐఏఎస్ క్వార్టర్స్లో ఐపీఎస్ అధికారి భార్య హత్య ఘటన రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రలకు నిదర్శనమని హరీశ్ ఆందోళన వ్యక్తంచేశారు. సీపీ సుమతి నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్తో హైదరాబాద్లో మహిళల భద్రత ఎంత డొల్లగా మారిందో బయటపడిందని తెలిపారు.
2024లో తెలంగాణలో 27,230 సైబర్ నేరాలు నమోదైనయ్. ఇది దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో గణనీయమైన శాతం. 2023తో పోలిస్తే సైబర్ నేరాలు దాదాపు 49 శాతం పెరుగడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు నమోదవుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా మారింది.
-హరీశ్రావు
రాష్ట్రంలో అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం అష్టకష్టాల పాలుచేస్తున్నదని హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న పంట కొనుగోలు చేయాలని అధికారుల కాళ్లు మొకే పరిస్థితిని ఈ ప్రభుత్వం తెచ్చిందని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలులో జాప్యం, కల్లాల వద్ద రైతుల ఇబ్బందులపై ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను ప్రభుత్వమే కొనకపోతే ఆ రైతన్నకు దికెవరు?’ అని ప్రశ్నించారు. కల్లాల్లో రోజుల తరబడి పంటకు కాపలా కాస్తూ, అన్నదాతలు పిట్టల్లా రాలిపోతుంటే ప్రభుత్వం కండ్లప్పగించి చూడటం తప్ప ఏమీ చేయడంలేదని విమర్శించారు. రైతులను ఆదుకోవాల్సిన పాలకులే వారికి మరణశాసనం రాస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో ఓ రైతు ధాన్యం కొనాలని తహసీల్దార్ కాళ్లపై పడిన ఘటనను ఉద్దేశించి తీవ్రంగా స్పందించారు. ‘నీ బాంచెన్ పంట కొనండి.. అని కాళ్లపై పడటం తప్ప రైతు ఇంకేం చేయగలడు?’ అని వాపోయారు. అన్నదాత చేతులతో అధికారుల కాళ్లు మొకిస్తున్న ఘనత రేవంత్ సరార్దేనని విమర్శించారు. రైతన్న కన్నీటి శాపం పాలకులను నీడలా వెంటాడుతూనే ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైనా స్పందించి, కొర్రీలు పెట్టకుండా తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.