Harish Rao | గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలు, హాస్టళ్లలో పని చేస్తున్న డైలీ వేజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు అని హరీశ్రావు విమర్శించారు. నెలల తరబడి ప్రభుత్వం వేతనాలు చెల్లించకుంటే చిరు ఉద్యోగులు ఎలా బతుకుతారు అని ప్రశ్నించారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ బతుకమ్మ, దసరా పండుగ సంబురం లేకుండా చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
వేతనాలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులకు ఆశ్రమ పాఠశాల్లలో, హాస్టళ్లలో సరైన సేవలు అందటం లేదని హరీశ్రావు అన్నారు. ఇది విద్యార్థుల ఆరోగ్యంపై, వారి చదువులపై ప్రభావం చూపుతున్నదని తెలిపారు. సమస్యలు పరిష్కరించాలంటూ అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. విసిగిపోయిన ఉద్యోగులు చివరకు సమ్మెబాట పట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించిన వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని, వారి ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.