Harish Rao | ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించలేని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలల తరబడి ఎదురు చూస్తూ, ఓపిక నశించి వీడియో రూపంలో తన ఆవేదనను వ్యక్తం చేస్తున్న ఈ విశ్రాంత ఉద్యోగి మాటలు వింటే మనస్సు చలించిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మూటలు, కోతలు, వాటాలు, కమీషన్ల గురించి మాత్రమే పనిచేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. మీకు రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కన్నీళ్లు కనిపించడం లేదా? వేదన వినిపించడం లేదా? అని ప్రశ్నించారు.
లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ అంటావు, మరో లక్ష కోట్లతో ఫోర్త్ సిటీ అంటావు, వేల కోట్లతో అక్కరకు రాని చోట ఆరు లైన్ల రోడ్లు వేస్తానంటావు.. కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లులు గ్రీన్ చానెల్ లో పెట్టి క్లియర్ చేస్తుంటావు. కానీ విశ్రాంత ఉద్యోగులకు మాత్రం రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయవని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీశ్రావు అన్నారు. కమిషన్లు రావని విశ్రాంత ఉద్యోగుల బకాయిలు విడుదల చేయడం లేదా? నీకు ఆ మనసు లేదా? అని మండిపడ్డారు. 30 ఏళ్లకు పైగా సేవలందించిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? వారి గోడు ఈ ప్రభుత్వానికి పట్టదా? అని ప్రశ్నించారు. 2024 మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు.
సర్వీసులో దాచుకున్న సొమ్మును కూడా తిరిగి ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తుండటం అమానవీయం, అనైతికమని హరీశ్రావు మండిపడ్డారు. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో రిటైర్డ్ ఉద్యోగులను మానసిక ఒత్తిడికి గురి చేయడం దుర్మార్గమని అన్నారు. మీ నిర్లక్ష్య పూరిత వైఖరి, పట్టింపులేని తనం వల్ల ఇప్పటికే అనేక మంది విశ్రాంత ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. బకాయిలు క్లియర్ చేసేందుకు ప్రతి నెల రూ. 700 కోట్లు విడుదల చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలే అయ్యాయన్నారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలలు తరబడి ఎదురు చూస్తూ, ఓపిక నశించి వీడియో రూపంలో తన ఆవేదనను వ్యక్తం చేస్తున్న ఈ విశ్రాంత ఉద్యోగి మాటలు వింటే మనస్సు చలించిపోతున్నది.
మూటలు, కోతలు, వాటాలు, కమీషన్ల గురించి మాత్రమే పనిచేసే ముఖ్యమంత్రి @revanth_anumula గారూ.. మీకు రిటైర్డ్ ఉద్యోగులు,… pic.twitter.com/guYUoKrqTT
— Harish Rao Thanneeru (@BRSHarish) November 22, 2025
దేశంలోనే విశ్రాంత ఉద్యోగులకు రూ. 10,000 కోట్ల బకాయిలు పెట్టిన రాష్ట్రం ఏదీ లేదని.. ఈ ఘనత కూడా నీకే దక్కింది రేవంత్ రెడ్డి అని హరీశ్రావు ఎద్దేవా చేశారు. హక్కుగా తాము పొందాల్సిన బెనిఫిట్స్ కోసం విశ్రాంత ఉద్యోగులను ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగేలా చేసిందని.. పైరవీలు చేసుకోవాల్సిన దుస్థితిని కల్పించిందని తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో విశ్రాంత ఉద్యోగులకు అవిశ్రాంత పోరాటం చేయాల్సిన పరిస్థితి కల్పించావని మండిపడ్డారు. ప్రజలకు హామీ ఇచ్చి నెరవేర్చని జాబితాలో ఉద్యోగుల పి ఆర్ సి, డి ఏ లు కూడా చేరాటం దురదృష్టకరమని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉద్యోగులను ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని.. పీఆర్సీ లేదు, హెల్త్ కార్డులు లేవు, 5 డీఏల జాడే లేదు, సీపీఎస్ రద్దుపై నాన్చివేత ధోరణి అని విమర్శించారు. ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని గొప్పలు చెప్పి, ఆచరణలో మాత్రం గాలికి వదిలేశారని అన్నారు. రెండు మూడు నెలలు జీతాలు అందక ఎంతో మంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మీ మాటల మాయాజాలంతో ఎంతకాలం ఉద్యోగులు, టీచర్లను మోసం చేస్తారని ప్రశ్నించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.