హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ఆకస్మిక వరదలతో నీట మునిగిన కాళేశ్వరం పంపులను ప్రభుత్వం నయాపైసా ఖర్చులేకుండా సంబంధిత ఏజెన్సీలతో ముందు కుదుర్చుకొన్న ఒప్పందం ప్రకారం పునరుద్ధరించిందని ఆర్థికమంత్రి హరీశ్రావు తెలిపారు. కాళేశ్వరంపై విపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. శనివారం శాసనసభలో సాగునీటిశాఖపై జరిగిన చర్చ సందర్భంగా సీల్పీ నేత భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నలకు హరీశ్రావు సమాధానమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు విపక్షాలకు అనుమతి ఇవ్వటంలేదన్న భట్టి ఆరోపణలను హరీశ్రావు తిప్పికొట్టారు. ఈ వానకాలం సీజన్లో గోదావరి చరిత్రలో రికార్డు స్థాయిలో వరదలు రావటంతో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఒక పంప్హౌజ్, చిన్న గోడ కూలిపోయిందని తెలిపారు. అధికారులందరూ పునరుద్ధరణ పనుల్లో తలమునకలై ఉండటం, ఆ బురదలో చిక్కుకోకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఆపి ఉంటారే తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యులు కాళేశ్వరం సందర్శనకు ఎప్పుడు వెళ్తారో చెప్తే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై బురదజల్లేందుకు కాంగ్రెస్, బీజేపీ మొదటి నుంచి కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు రియల్ఎస్టేట్ వ్యాపారమన్నారు. అర కిలోమీటర్ పైకి నీటిని ఎత్తిపోసుడు ఎట్లా సాధ్యమైతది? ప్రాజెక్టు పూర్తయితదా? అని అనుమానాలు వ్యక్తంచేశారు. అన్ని ఆరోపణలను తిప్పికొడుతూ సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణలో రికార్డు స్థాయిలో 3.5 సంవత్సరాల్లోనే ప్రాజెక్టును పూర్తి చేశాం. తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చడంతోపాటు 50 శాతం తెలంగాణను ఈ ప్రాజెక్టు సస్యశ్యామలం చేస్తున్నది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టును రూ.16 వేల కోట్లకు అంచనావేసి, పనులు మొదలు పెట్టకుండానే దానిని రూ.38,500 కోట్లకు పెంచింది. అధికారం నుంచి దిగిపోతూ డీపీఆర్ను కేంద్రానికి సమర్పించేనాటికి అంచనా వ్యయాన్ని రూ.48 వేల కోట్లకు పెంచింది. బరాజ్లు లేవని, నీటి రిజర్వాయర్లు లేవని, మొత్తంగా ప్రాజెక్టునే నీళ్లులేని చోట ప్రతిపాదించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ప్రాజెక్టును రీ డిజైన్ చేసి అదనంగా మూడు బరాజ్లు, 10 లిఫ్టులు, 50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో అతిపెద్ద మల్లన్నసాగర్తోపాటు, కొండపోచమ్మ, రంగనాయకసాగర్ తదితర మొత్తంగా 16 జలాశయాలను నిర్మించారు. ప్రతి రూపాయిని సద్వినియోగం చేసేలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. 10 స్టేజ్ల ఎత్తిపోతల, 108 బహుబలి పంపులు, 98 సర్జ్పూల్స్, 203 టన్నెల్స్ కలిపి మూడున్నరేండ్లలోనే పూర్తి చేశాం. 1.35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించడంతోపాటు, 17 లక్షల ఎకరాల ఆయకట్టును స్థీరకరించాం. ఎస్సారెస్పీకి కూడా నీళ్లు తీసుకెళ్లి ఆర్మూర్, బాల్కొండకు, సరస్వతీ కెనాల్కు నీళ్లు అందిస్తున్న ఘనత కాళేశ్వరం ప్రాజెక్టుది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 8,017 చెరువులు, 66 చెక్డ్యామ్లను నింపాం. ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 140.9 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. గోదావరిలో కట్టిన బరాజ్ల వల్ల 170 కిలోమీటర్ల మేర గోదావరి జీవనదిగా మారింది. ఇది తెలంగాణ సాధించిన విజయం. బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనత. 3.5 ఏండ్లలో ప్రాజెక్టుకు 16 అనుమతులు సాధించటం దేశ చరిత్రలో రికారు. జలయజ్ఞంలో నాటి కాంగ్రెస్ కేవలం 5.71 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించి 93 వేల ఎకరాలను స్థిరీకరించది. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ, చెక్డ్యామ్లు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే 17.30 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టుకు నీరందిస్తున్నది. 30 లక్షల ఎకరాలను స్థిరీకరించింది. అందువల్లనే తెలంగాణలో భూమికి బరువయ్యేంత పంట పండుతున్నది’ అని హరీశ్రావు వెల్లడించారు.
పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా తదితర పెండింగ్ ప్రాజెక్టులను రూ.3,663 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసిందని మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కోరుతూ రాష్ట్రం ఏర్పడిన 42 రోజుల్లోనే ట్రిబ్యునల్ కోసం అప్పీల్ చేశామని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ఒత్తిడి మేరకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని అపెక్స్ కౌన్సిల్లో హామీ ఇచ్చిన కేంద్రం నేటికీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదని ధ్వజమెత్తారు. ట్రిబ్యునల్ కోసం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కూడా తెలంగాణ సిద్ధమని స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ వేయకుండా 9 ఏండ్లుగా కాలయాపన చేస్తున్న బీజేపీకి కృష్ణా జలాలపై మాట్లాడే హక్కు లేదని నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలకు రాజకీయాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని మండిపడ్డారు. ‘కృష్ణా నీళ్లు పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పారకపోవటానికి బీజేపీనే కారణం. నీటి కేటాయింపులు జరిగి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు వచ్చి ఉండేవి. ఇప్పటికే ప్రాజెక్టులో భాగమైన అంజనిగిరి, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల నిర్మా ణం, ప్రధాన కాలువలు, పంప్హౌజ్ల నిర్మాణంతోపాటు మొత్తంగా ప్రాజెక్టు పనులు 60 శాతం పూర్తయ్యాయి. ఎన్జీటీ స్టే వల్ల నిర్మాణంలో జాప్యమవుతున్నది. అయినప్పటికీ ఆడ్డంకులన్నీ అధిగమించి కృష్ణా జలాలను తీసుకొచ్చి పాలమూరు రైతుల కాళ్లు కడుగు తాం. తెలంగాణ ప్రభుత్వం అవిశ్రాంత పో రాటం ఫలితంగానే రాయలసీమ లిఫ్టు పను లు నిలిచిపోయాయి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పోలవరం బ్యాక్వాటర్ అధ్యయనానికి ఒ ప్పించడంలోనూ తెలంగాణ ఇటీవల విజ యం సాధించింది. ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయి. త్వరలోనే సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాలకు నీళ్లు ఇస్తాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన వట్టెం రిజర్వాయర్ నుంచే డిండి ప్రాజెక్టుకు నీళ్లు ఇస్తాం. ఈ మేరకు ఇప్పటికే సీడబ్ల్యూసీకి డీపీఆర్ను అందజేశాం’ అని హరీశ్రావు తెలిపారు.
పెండింగ్ ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదన్న ప్రతిపక్షాల ఆరోపణలను మంత్రి హరీశ్రావు తిప్పికొట్టారు. మిడ్మానేరు, ఎస్ఆర్ఎస్పీ1, ఎస్సారెస్పీ 2, గొల్లవాగు, గూడెం, ఎన్టీఆర్ కెనాల్ పెండింగ్ పనులను పూర్తి చేశామని ఉదహరించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి కావచ్చాయని, అది ఏడాదిలోగా అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. గత కాంగ్రెస్ హయాంలో ఏనాడూ దేవాదుల ద్వారా సంవత్సరంలో 90 రోజులు నీళ్లు తీసుకోలేకపోయామని, సీఎం కేసీఆర్ హయాంలో సమ్మక్క బరాజ్ కట్టిన తర్వాత నేడు 365 రోజులు వరంగల్ జిల్లాకు నీళ్లు అందుతున్నాయని తెలిపారు. ఇక ప్రాజెక్టుల నిర్వహణ కోసం అధికారులు ఇబ్బంది పడకూడదని ఈఎన్సీలు, సీఈలకే సీఎం కేసీఆర్ ఆర్థిక అధికారాలు కట్టబెట్టారని, ఏటా దాదాపు రూ.600 కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పారు. ఉమ్మడి పాలనలో శిథిలమైన ఐడీసీ లిఫ్టులను పునరుద్ధరించామని, రాష్ట్రవ్యాప్తంగా 600లకు పైగా ఉండగా అందులో 418 లిఫ్ట్లు పూర్తిగా, మిగిలినవి పాక్షికంగా పనిచేస్తున్నాయని, తద్వారా 3.38 లక్షల ఎకరాలకు నీరందుతున్నదని వివరించారు.