హైదరాబాద్, మార్చి 7 : వారించినా వినకుండా శాసనసభలో బీజేపీ సభ్యులు వెల్లోకి దూసుకురావడంతోనే వారిపై స్పీకర్ చర్యలు తీసుకొన్నారని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. సభలో గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భాల్లో సభ్యులు ఎవరైనా నిరసన తెలపాలనుకొంటే కూర్చున్నచోటే నిల్చొని నిరసన తెలుపవచ్చని, వెల్లోకి రావడం, పోడియం చుట్టూ చేరి నినాదాలు చేయవద్దని తేల్చిచెప్పారు. ఇది తానో, ప్రభుత్వమో చెప్పడం లేదని, గత శాసనసభ సమావేశాల సందర్భంగా స్పీకర్ అధ్యక్షతన జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ)లోనే నిర్ణయం తీసుకొన్నారని వివరించారు. ఆ సమావేశానికి బీజేపీ ఫ్లోర్లీడర్ కూడా హాజరయ్యారని గుర్తు చేశారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా వెల్లోకి వస్తే చర్యలు తీసుకోవడాన్ని బీజేపీ ఎలా తప్పుపడుతుందని ఆక్షేపించారు.
వెల్లోకి వస్తే స్పీకర్ చర్యలు తీసుకొంటారన్న విషయం సభ్యులందరికీ తెల్సిందేనని, బీజేపీ ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానే తమకేదో అన్యాయం జరుగుతున్నట్టు సభ వెలుపల మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజ్యసభలో నిరసన తెలిపితేనే అక్కడ చైర్మన్ సభ్యులపై చర్యలు తీసుకొన్నారని, మరి అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా అని ప్రశ్నించారు. రాజ్యసభలో బీజేపీ చేస్తే ఒప్పు.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే తప్పా అని నిలదీశారు. బీజేపీ నాయకులకు ప్రజాసమస్యలపై పట్టింపులేదని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించేందుకు వారు సిద్ధంగా లేరని విమర్శించారు. అందుకే వారు శాసన వ్యవస్థను గౌరవించకుండా, స్పీకర్ చెప్తున్నా వినకుండా వెల్లోకి వచ్చారని మంత్రి హరీశ్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ను పెట్టిందని, రాష్ట్రం స్వయంసమృద్ధిని సాధిస్తున్నదని, లక్ష కోట్లకుపైగా పన్నుల రాబడి ఉన్నదని చెప్పారు. ఈ బడ్జెట్లో కొత్త పథకాలను ప్రకటించామని, అనుకొన్న మేరకు దళితబంధుకు నిధులు కేటాయించామని వెల్లడించారు. 2023 మార్చి నెలాఖరు నాటికి 2 లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు అందుతుందని తెలిపారు.