సంగారెడ్డి, జనవరి 23: రాష్ట్రంలో ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని ఆర్థికమంత్రి హరీశ్రావు మండిపడ్డారు. బండి తొండి మాటలు మానుకోవాలని హితవు పలికారు. దమ్ముంటే కేంద్రంతో కొట్లాడి ట్రైబల్, మైనింగ్ యూనివర్సిటీలను తీసుకురావాలని సవాల్ విసిరారు. ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్లో దళితబంధు కార్యాచరణపై సమీక్ష తర్వాత మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు అంటేనే కార్పొరేట్లకు కొమ్ముకాసే ప్రభుత్వమని పేరున్నదని చురకలంటించారు. బీజేపీకి దళితులపై ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలుచేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను డిమాండ్ చేశారు. దళితబంధులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 100 మందికి ఉపాధి కల్పించేందుకు యూనిట్ల మంజూరుచేసేందుకు సీఎం నిర్ణయం తీసుకురన్నారని చెప్పారు. ఫిబ్రవరిలోగా నియోజకవర్గంలోని ఒకటి, రెండు గ్రామాల నుంచి లబ్ధ్దిదారుల ఎంపిక జరుగుతుందని ఉద్ఘాటించారు.
మన ఊరు-మన బడికి రూ. 7,280 కోట్లు
‘మన ఊరు-మన బడి’తో పేద విద్యార్థులకు ఇంగ్లిష్ విద్యాబోధన చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్టు మంత్రి హరీశ్రావు తెలిపారు. వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేసి, అప్గ్రేడ్ చేసి మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఇందుకోసం రూ. 7,280 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు. ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తామనగానే ప్రతిపక్షాలకు ఎందుకు కలవరం మొదలైందో అర్థం కావడంలేదని ఎద్దేవాచేశారు. బండి సంజయ్, రేవంత్రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు మానుకుని..కేంద్రం ఇవ్వాల్సిన యూనివర్సిటీలు, నవోదయ విద్యాలయాలపై స్పందించాలని చురకలంటించారు. రాష్ట్ర పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని మించి ఉపాధ్యాయులు ఉన్నారని స్పష్టంచేశారు. 1,32,899 మందికి కొత్త ఉద్యోగాలు ఇచ్చామని, టీఆర్టీతో 8,792, గురుకులాల్లో 11,500 మంది ఉద్యోగాలు పొందారని గుర్తుచేశారు. జిల్లా ఒక నవోదయ పాఠశాల ఉండాలని నిబంధన ఉన్నదని, కానీ, కేంద్రం ఒక్క కొత్త పాఠశాలను మంజూరుచేయలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి పదులసంఖ్యలో ఉత్తరాలు రాసినా స్పందన లేదని దుయ్యబట్టారు.
దళితుల కోసం రూ.24,114 కోట్ల నిధులు ఖర్చు
తెలంగాణ ఏర్పాటైన ఏడున్నర ఏండ్లలో దళితుల అభివృద్ధికి రూ.24,114 కోట్లను ఖర్చుచేశామని మంత్రి హరీశ్రావు తెలిపారు. కానీ, కాంగ్రెస్ పదేండ్ల పాలనాకాలంలో కేవలం రూ.6,198 కోట్లు ఖర్చు చేసిందని గుర్తుచేశారు. సమైక్య పాలనలో బీసీలకు 6,593 కోట్లను ఖర్చు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం రూ.20,400 కోట్లను వెచ్చించిందని స్పష్టంచేశారు. దేశంలో 20.14 కోట్ల మంది దళితులు ఉన్నారని, వారి అభివృద్ధికి రూ.1,26,259 కోట్లు బడ్జెట్లో పెట్టారని, ఒక్కొక్కరికి రూ.6,269 చొప్పన కేంద్రం కేటాయించిందని చెప్పారు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షల మంది దళితులు ఉండగా, వారి అభివృద్దికి రూ.19,313 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని, అంటే ఒక్కొక్కరికి రూ.35,699 చొప్పున వెచ్చించినట్టు వెల్లడించారు. 9,96,980 మందికి కల్యాణలక్ష్మి ఆర్థికసాయం అందించినట్టు వివరించారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, మాణిక్యరావు, క్రాంతికిరణ్ పాల్గొన్నారు.
క్లిష్ట పరిస్థితుల్లో వెలకట్టలేని సేవలు
మహారాష్ట్ర గర్భిణికి భైంసా వైద్యుల సాధారణ ప్రసవం
వైద్య సిబ్బందికి మంత్రి హరీశ్రావు అభినందనలు
కరోనా క్లిష్టపరిస్థితుల్లో రాష్ట్ర వైద్యసిబ్బంది వెలకట్టలేని సేవలు అందిస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రశంసించారు. ‘మహారాష్ట్రకు చెందిన గర్భిణికి కరోనా సోకినా, నిర్మల్ జిల్లాలోని భైంసా ప్రభుత్వ దవాఖానలో సాధారణ ప్రసవం చేయడంతో పాటు, జనగామ ఎంసీహెచ్ దవాఖానలో కరోనా సోకి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న గర్భిణికి సురక్షితంగా డెలివరీ చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో వెలకట్టలేని సేవలు అందిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్న రాష్ట్ర వైద్య సిబ్బందికి అభినందనలు’ అని మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు.