Harish Rao | సంగారెడ్డి, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీలకు తనదే జిమ్మేదారీ అన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీల జిమ్మేదారీ ఏమాయె? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీల హామీ.. అధికారంలోకి వచ్చి 120 రోజులు గడిచినా నెరవేరలేదని విమర్శించారు. శనివారం జహీరాబాద్లో ఎమ్మెల్యే మాణిక్రావు అధ్యక్షతన జరిగిన జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో, సిద్దిపేట నియోజకవర్గంలోని నారాయణరావుపేట మండలం జక్కాపూర్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్ పాల్గొని మాట్లాడారు. ‘పార్టీ మారిన తక్షణమే ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని రాహుల్గాంధీ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టారు. ఇక్కడేమో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటామంటున్న మంత్రి ఉత్తమ్కుమారెడ్డి అంటున్నారు. కాంగ్రెస్లో రాహుల్ మ్యానిఫెస్టో, రేవంత్రెడ్డి మ్యానిఫెస్టో వేర్వేరా? కాంగ్రెస్ హైకమాండ్ అంటే మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్కలేదా?’ అని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్లో చేరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని, వాళ్లను తాము చూసుకుంటామని మంత్రి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి సిగ్గుందా? అని మండిపడ్డారు. కాంగ్రెస్ అభద్రతా భావంలో ఉన్నదని, బీఆర్ఎస్ను చూసి భయపడుతున్నదని, అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ను బలహీనపరిస్తే తమకు అడ్డు ఉండదని కాంగ్రెస్ భావిస్తున్నదని, అయితే కాంగ్రెస్ ఆటలు సాగవని స్పష్టం చేశారు. చంద్రబాబు, వైఎస్, కిరణ్కుమార్రెడ్డి వంటివారు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలని చూశారని, అక్రమ కేసులు కూడా పెట్టారని గుర్తుచేశారు. అయినా కేసీఆర్ నేతృత్వంలో ఎక్కడా తలవంచకుండా పోరాడి తెలంగాణ సాధించుకున్నామని తేల్చి చెప్పారు. ఇప్పుడూ ఎవరికీ భయపడకుండా కాంగ్రెస్పై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వం, పోలీసులు అక్రమ కేసులు పెట్టాలని చూస్తే సహించేది లేదని అన్నారు. ఏ నాయకుడు, కార్యకర్తకు ఆపదొచ్చినా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోతున్నాయని తెలంగాణలోనూ అదే జరుగుతుందని వ్యాఖ్యానించారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాణిక్రావు, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవీప్రసాద్, శివకుమార్, జైపాల్రెడ్డి, బుచ్చిరెడ్డి, నరహరిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.