జోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్య రంగాన్ని పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తునారని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజి ఉండాలనే లక్ష్యంతో జిల్లాలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లాలో 300 పడకల జిల్లా ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి, మల్దకల్ మండలంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు.
తదనంతరం జిల్లాలో హిమాలయ హోటల్లో వైద్య అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో 300 పడకల ఆసుపత్రితోపాటు నర్సింగ్ కాలేజి అందుబాటులోకి రానున్నదని, ఈ రెండు పూర్తి అయితే జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని, సుమారు 20 పైగా స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయని, హైదరాబాద్ వరకు రావలసిన అవసరం ఉండదని తెలిపారు.
అన్ని వైద్య సేవలు ఉచితంగా అందించి పేద వాడిపై ఎలాంటి భారం పడకుండా చూడాలన్నారు. జిల్లా ఆసుపత్రిలో రేడియాలజి ల్యాబ్ మరియు ప్రత్యేకమైన చిన్న పిల్లల కేర్ సెంటర్ను కూడా ప్రారంబించామని, ఇందులో ఎక్స్రే, అల్ట్రాసౌండ్, కాన్సర్ పరీక్ష, ఇసిజి, సిటీ స్కాన్ వంటి ముఖ్యమైన పరీక్షలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే అన్ని రకాల ఉచిత వైద్య సేవలు ఉపయోగించు కోవాలని సూచించారు.
పెండింగ్లో ఉన్న ఆసుపత్రి అభివృధి పనులు పూర్తి చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. కోవిడ్ వ్యాక్సినేషన్పై కూడా ఆయన మాట్లాడారు. మొదటి, రెండవ డోస్ పూర్తిచేసి జిల్లాలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయ్యేలా చూడాలన్నారు. జిల్లాలో పోషణలోపం ఉన్న పిల్లలకు పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉన్న సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ఎంపీ రాములు, వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ వాకాటి అరుణ, జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ఆలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ అబ్రహం, అదనపు కలెక్టర్ శ్రీహర్ష, జిల్లా వైద్య అధికారి చందు నాయక్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.