హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు దెబ్బ తినే విధంగా రాజకీయాలు చేయకూడదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడంపై దృష్టి సాధించకుండా గూగుల్ ప్రచారంపై దృష్టిపెట్టడం దురదృష్టకరమని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అనేక అద్భుతాలు సాధించిందని తెలిపారు. పాలకులే నెగెటివ్ మైండ్ సెట్తో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. లండన్ పర్యటనలో భాగంగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అనేక అద్భుతాలు సాధించింది. ఒకప్పుడు బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే నానుడి ఉండేది. కానీ కేసీఆర్ పాలనతో ‘తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది’ అనే కాడికి తెచ్చాం. గత 10 ఏండ్లలో తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంది. తలసరి విద్యుత్ వినియోగంలో కూడా దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. జీఎస్డీపీ గ్రోత్లో తెలంగాణకు దరిదాపులో కూడా ఏ రాష్ట్రం లేదు. నల్లా ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని కేసీఆర్ అందించారు. మ్యానిఫెస్టోలో పెట్టుకోకపోయినా ఇంటింటికీ తాగునీరు అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్. అసెంబ్లీలో వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి నల్ల ద్వార నీళ్లియ్యకపోతే ఓట్లు అడుగను అని చెప్పిన గొప్ప నాయకుడు. మిషన్ భగీరథ కార్యక్రమంతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించి చూపించారు.
తెలంగాణ రాకముందు హైదరాబాద్లో పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ఇచ్చేవారు. 4 గంటలకు కరెంటు కట్టు ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో 6 గంటల నుంచి 8 గంటల పవర్ కట్ ఉండేది. 60 ఏండ్లలో కాని పనిని కేసీఆర్ ఒక్క సంవత్సరంలో సాధించి 24 గంటల నాణ్యమైన కరెంటును అందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రతీ ఉదయం విద్యుత్పై సమీక్ష చేసి, పవర్ కొనుగోలు టైమ్స్ని చూసేవారు. తర్వాత మిషన్ భగీరథ ప్రోగ్రెస్ చూసేవారు. అంకితభావంతో పనిచేసేవారు. అందుకే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది.
మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని చేపట్టింది. పదేండ్లయినా కూడా భారతదేశంలో ‘హర్ ఘర్ జల్’ పూర్తికాలేదు. కానీ తెలంగాణలో మూడేండ్లలోనే మిషన్ భగీరథను పూర్తి చేసుకున్నాం. ఉమ్మడి పాలనలో ఊర్లలోని చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. చెరువుల్లో నీళ్లు బాగుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. వ్యవసాయానికి సాగునీరు, తాగునీరు అందుతాయి. మిషన్ కాకతీయ ద్వారా మూడేండ్లలో దాదాపు 30 వేల చెరువులను పునరుద్ధరించాం. ఈ కార్యక్రమం మొత్తం దేశం దృష్టినే ఆకర్షించింది. దీనిని ఆదర్శం తీసుకుని అమృత సరోవర్ కార్యక్రమాన్ని చేపట్టిన కేంద్రం.. అధ్యయనం చేయడానికి రాష్ట్రానికి అధికారులను పంపించింది. రైతుల కోసం దేశంలోనే నేరుగా నగదు బదిలీ చేసిన ఒకే ఒక కార్యక్రమం రైతుబంధు.
వాచ్మెన్ జాబ్ చేసినా పిల్లని ఇస్తారు. కానీ రైతు అని అంటే పిల్లని ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. వ్యవసాయం అంటే చిన్నచూపు అయింది. అలాంటి పరిస్థితుల నుంచి కేసీఆర్ రైతుబంధు అని ఒక కార్యక్రమం చేపట్టి.. ప్రతి ఏడాది రూ.10 వేలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు అందించారు. సాగునీటిని అందించాం. తద్వారా వ్యవసాయం లాభసాటిగా మారింది. 2014కి ముందు ఎక్కడ చూసినా ఎకరాకు రూ.2, రూ.3 లక్షలకు మించి ఉండేది కాదు. ఇప్పుడు తెలంగాణలో రూ.30 నుంచి 50 లక్షలకు తక్కువ లేదు. ఈ కార్యక్రమాన్ని కాపీ కొట్టిన కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కిసాన్’ అని చేపట్టింది. విద్యుత్ వినియోగం అయినా, రోడ్ ట్రాన్స్పోర్ట్ అయినా, ఏ కార్యక్రమమైనా తెలంగాణ దేశానికి ఆదర్శం.
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7.7 శాతం గ్రీన్ కవర్ని పెంచి ఇండియాలో తెలంగాణ నంబర్ వన్గా నిలిచింది. గ్రీన్ కవర్ పెంచడం ద్వారా ఓట్లు రావు. సాధారణంగా రాజకీయ నాయకులు పచ్చదనంపై దృష్టి సాధించరు. కానీ భవిష్యత్ తరాల కోసం పచ్చదనాన్ని అందించిన ఏకైక నాయకుడు కేసీఆర్. అదేవిధంగా ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దారు. ఎన్నికల ముందు ఒకాయన కేసీఆర్ 24 గంటలు కరెంటు ఇచ్చిండు, నేను 48 గంటలు కరెంటు ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ కల్యాణ లక్ష్మి కింద రూ.లక్ష ఇస్తున్నారు కదా, మేము తులం బంగారంతో పాటు రూ.లక్ష ఇస్తామన్నారు.
ఒకరోజు నా దగ్గరికి పంచాయతీ సెక్రటరీలు వచ్చారు.. మాకు చాలా ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయి. గ్రామపంచాయతీలో డబ్బులు రాక అప్పుల పాలయ్యాం. ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి కూడా లేదు అని చెప్పారు. మీకు పంచాయతీ సెక్రెటరీలుగా ఉద్యోగాలు ఎవరిచ్చారు అని అడిగితే.. కేసీఆర్ ఇచ్చారని, ఒకేసారి 10 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. మరి ఎందుకు మమ్మల్ని ఓడించారు అని అడిగితే.. మీ విలువ మాకు ఎలా తెలుస్తది, తెలంగాణ వచ్చినంక మీరే నేరుగా ప్రభుత్వంలోకి వచ్చారు. వేరే వాళ్ళు ఇంకేమన్నా బాగా చేస్తారేమో అని అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు మాకు తెలిసింది. పాలేవో నీళ్లేవో అని చెప్పారు. ఇతర ప్రభుత్వాలతో మిమ్మల్ని పోల్చే అవకాశం లేకుండా పొరపాటు చేశామని అన్నారు.
ఆంధ్రాలో ఒక ఎకరా అమ్మితే తెలంగాణలో పదెకరాలు వచ్చేది అని అనేవారు. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రలో పది ఎకరాలు కొనవచ్చు. ఇప్పుడు రూ.10 లక్షలు తక్కువకు అమ్ముదామంటే ఎవరూ కొనేవాళ్లు లేకుండా పోయింది. తెలంగాణ ఓ గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి జరుగుతున్నదని కేసీఆర్ చెప్పేవారు. ఈరోజు పాలకులే నెగెటివ్ మైండ్ సెట్తో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది. కొన్ని సందర్భాల్లో మనం కూడా చిన్న చిన్న తప్పులు చేసినా వాటిని కూడా మేము సరి చేసుకుని అందుకు వెళ్తున్నాం. ఆరోగ్యంలో కూడా మాతా శిశు మరణాల రేటును తగ్గిస్తూ దేశంలో మూడో స్థానంలో వచ్చాం. ఇప్పటికీ బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఉంటే ఈపాటికి నంబర్ వన్ అయ్యేవాళ్లం. ఇప్పుడున్న ప్రభుత్వం పనిచేయడంపై దృష్టి సాధించకుండా గూగుల్ ప్రచారంపై దృష్టిపెట్టడం దురదృష్టం.
తెలంగాణలో ఈరోజు అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. ఏ శాఖలో చూసినా అవినీతి పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాళేశ్వరం అంటే రూ.లక్ష కోట్లు పోయాయని దుష్ప్రచారం చేస్తున్నారు. గతేడాది, ఈ సంవత్సరం మంచి వర్షపాతం ఉండె. ఎస్సారెస్పీ నుంచి మిడ్ మానేరుకు నీళ్లు వస్తాయి. కాళేశ్వరం మోటర్లను మిడ్ మానేరు నుంచి ఆపరేట్ చేస్తాం. 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు వస్తాయి. సాధారణ వర్షపాతం ఉన్న సంవత్సరంలో ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసుకుంటే అక్కడినుంచి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడ వర్షపాతం లేకున్నా మేడిగడ్డ వద్ద నీళ్లు ఉంటాయి. ఎంత క్రైసిస్ వచ్చినా అక్కడ నీళ్లు ఉంటాయి. 37 లక్షల ఎకరాలకు సాగునీరు, 60 శాతం తెలంగాణకు తాగునీరు పరిశ్రమలకు 60 టీఎంసీలు ఇవ్వొచ్చు. కాళేశ్వరంలో 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. మల్లన్న సాగర్ నుంచి మూసీకి నీళ్లు తీసుకెళ్తానని రేవంత్ రెడ్డి అన్నాడు. రూ.7 వేల కోట్లతో టెండర్లు కూడా పిలిచారు. కాళేశ్వరం కూలిపోతే మల్లన్న సాగర్ నుంచి నీళ్లను మూసీకి ఎలా తీసుకెళ్తావు రేవంత్ రెడ్డి?.
గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశావు. దానికి ఆధారం కాళేశ్వరం, మల్లన్న సాగరే కదా. కాళేశ్వరం లేకున్నా రికార్డ్ పంట పండిందని ఉత్తంకుమార్ రెడ్డి అంటున్నారు. మీ ప్రభుత్వం వచ్చాక ఒక చెరువు దగ్గర ఒక చెక్ డ్యాం కట్టారా?, ఒక ప్రాజెక్టు కట్టారా?, ఒక ఎకరానికి అయినా నీల్లు ఇచ్చారా అని ఆయనను అడిగా. మరి ఇంత పంట ఎలా సాధ్యమైందని ప్రశ్నించా. పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి వల్ల ఇంత పంట పండింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభావం ఉంది. కేవలం మూడు బ్యారేజీల్లో.. ఒక్క బ్యారేజీలో మాత్రమే మూడు పిల్లర్లు కుంగాయి. అసెంబ్లీలో ఎమ్మెల్సీ కోదండరాం.. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు గురించి ప్రశ్న అడిగితే.. అవి బాగానే ఉన్నాయని, ఎలాంటి ఇబ్బంది లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి జవాబు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టి, ఆ పార్టీ హయాంలోనే కూలిన కడెం, ఎల్లంపల్లి, పెద్దవాగు ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి?. మూడు నాలుగు వందల కోట్లలో మేడిగడ్డ రిపేర్ అయిపోతుంది. కానీ కాగ్రెస్ మాత్రం లక్ష కోట్లు అని దుష్ప్రచారం చేస్తున్నది. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు దెబ్బ తినే విధంగా రాజకీయాలు చేయకూడదని’ హరీశ్ రావు అన్నారు.