హైదరాబాద్: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్పై (KTR) అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అక్రమ కేసులతో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
‘మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై రాజకీయకక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట ఇది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గం. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్లో రెండేళ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నది కాంగ్రెస్ సర్కార్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నడు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికం.
స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు. అక్రమ కేసులతో కేటీఆర్, బిఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటాం.’ అని ట్వీట్ చేశారు.