హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసింది. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని మోసపూరిత హామీలిచ్చి గెలిచాక ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. శుక్రవారం పట్టభద్రుల ఎన్నికల(MLC election) ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన సన్నాక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. హామీలను అమలు చేయకుండా మొద్దనిద్రపోతున్న కాంగ్రెస్ను తట్టి లేపాలంటే ఆ పార్టీని ఓడగొట్టాలి.
అధికారంలోకి వచ్చి ఆరు నెలలై ఒక్క జాబ్ నోటిఫికేషన్ లేదు. జాబ్ క్యాలెండర్ లేదు. 2 లక్షలు ఉద్యోగాలు భర్తీ చేసేది ఇలాగేనా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు 4 వేల భృతి, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, అమ్మాయిలకు ఉచిత స్కూటీ.. ఒక్క హామీ అమలు కాలేదన్నారు. ఉద్యోగులకు 4 డీఏలు పెండింగులో ఉన్నాయి. డీఏపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పిన రేవంత్ రెడ్డి మాటమీద నిలబడలేదని విమర్శించారు. ఉపాధాయ్యులపై లాఠీ చార్జీ చేశారు. ఇంతకన్నా అమానుషం ఉంటుందా? అని సూటిగా ప్రశ్నించారు.
నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ స్వయంగా చెప్పారు. కానీ అలాంటి హామీనే ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలాడు తున్నారని మండిపడ్డారు. వడ్లకు 500 బోనస్ ఇస్తామని మీ మేనిఫెస్టోలో చెప్పి ఇప్పుడు సన్నవడ్లకే అని సిగ్గులేకుండా రైతులను మోసం చేశారని విమర్శించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతుడైన రాకేశ్ రెడ్డిని గెలిపించి కాంగ్రెస్కు గుణపాఠం నేర్పాలన్నారు. హైదరాబాద్ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా చేసేందు బీజేపీ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. మన హైదరాబాద్ మనకే దక్కాలంటే అందరూ బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలన్నారు. ఖమ్మం జిల్లా విజ్ఞులు, మేధావులు, విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు రాకేశ్ రెడ్డికి ఓటు వేయండి. మీ తరపున ఆయన శాసన మండలిలో పోరాడతాడని హామీనిచ్చారు.