హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు ప్రజల పక్షాన్నే పోరాడు తుందని మరోసారి రుజువైంది. అందుకు సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ఉన్న ఫలంగా ప్రజా భవన్కు పరుగులు పెట్టడమే తాజా నిదర్శనం. అసెంబ్లీలో బీఆర్ఎస్ దెబ్బకు సీఎం రేవంత్రెడ్డి నేడు ప్రజాభవన్(Praja Bhavan)కు వెళ్లాల్సి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) అన్నారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో కొద్దిసేపు చిట్చాట్చేశారు. ప్రతి రోజు ప్రజాభవన్కు వెళ్తానని ప్రగల్బాలు పలికిన సీఎం అధికారంలోకి వచ్చాక తొలిరోజు మాత్రమే వెళ్లారన్నారు. ఇదే విషయంపై బీఆర్ఎస్ ఆధారాలతో నిలదీశామన్నారు.
దీంతో ఈ రోజు హడావుడిగా కేవలం అరగంట ముందు సమాచారం ఇచ్చి వెళ్తున్నారన్నారు. ఇదే విషయం నిన్ననే ప్రజలకు సమాచారమిస్తే చాలా మంది తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చేవారని హరీశ్ రావు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ పాత్రను హుందాగా పోషిస్తుందన్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తుతూ పేదల పక్షాన నిలుస్తామన్నారు.