Harish Rao | హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ ఒ క్కటే కాదని, ప్రాజెక్టు సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. కాళేశ్వరమంటే 3 బరాజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్హౌజ్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగ సమాహారమని వివరించారు.
అయినప్పటికీ ప్రాజెక్టుపై కాంగ్రె స్ లేనిపోని ఆరోపణలను చేస్తున్నదని, బురద రాజకీయాలకు పాల్పడుతున్నదని నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం మేడిగడ్డలో పర్యటించి చేసిన ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ భవన్లో బుధవారం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు, సీఎం ఆరోపణలను తిప్పికొట్టారు. ‘సీఎంను రాజీనామా చేసి మాకు అధికారం అప్పగించమనండి. రిపేర్ చేసి చూపిస్తాం. మేం మేడిగడ్డను పునరుద్ధరించి నీళ్లు ఇచ్చి చూపిస్తాం’ అని సవాల్ చేశారు. కాంగ్రెస్ నేతలకు సీఎం మేడిగడ్డనే కాకుండా మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, అన్నపూర్ణ, పంప్హౌజ్లు, కాలువలు వాటికింది పంట పొలాలనూ చూపించాల్సిందని అన్నా రు. కాళేశ్వరం గురించి కాంగ్రెస్ ఎంత తకువ చేసి మాట్లాడినా అది ముమ్మాటికీ తెలంగాణకు వరదాయినేనని, తెలంగాణ ప్రజలకు జీవధార అని అభివర్ణించారు.
లోయర్ మానేరు నుంచి సూర్యాపేట దాకా నిండిన చెరువులు, పండిన పంట లు, భూమిలో పెరిగిన ఊటలు, మోటర్లు లే కుండానే ఉబికివస్తున్న బోర్లు.. ఇవన్నీ కాళేశ్వరం ఫలాలేనని ఉదహరించారు. కూడవెల్లి వాగు పొంగిందన్నా, హల్దీవాగు దుంకిందన్నా, చెక్డ్యామ్లు పొంగిపొర్లాయన్నా, చెరువులు మత్తడి దుంకినా అది కాళేశ్వరం ప్రసాదించిన ఫలితమేనని,పెరిగిన పంటరాశుల్లో ప్రతిబింబించేది కాళేశ్వరమేనని తెలిపారు.
పునరుద్ధరణ చేపట్టండి.. నీళ్లను మళ్లించండి
రెండు పిల్లర్లు కుంగినందుకు తెలంగాణకు ప్రాణాధారమైన కాళేశ్వరం ప్రాజెక్టును అవమానిస్తున్నారని, ఆ సాకుతో ప్రాజెక్టును అలక్ష్యం చేస్తున్నారని హరీశ్రావు నిప్పులు చెరిగారు. రాజకీయ లబ్ధి కోసం మొత్తం ప్రాజెక్టునే డ్యామేజ్ చేయాలనే దుష్ట పన్నాగానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
కుంగిన పిల్లర్లకు రిపేర్లు చేయించి పొలాలకు నీళ్లు మళ్లించాలని, పిల్లర్ల కుంగుబాటుపై విచారణ జరిపి బాధ్యులను నిరభ్యంతరంగా శిక్షించాలని శాసనసభ వేదికగా తామే డిమాండ్ చేశామని గుర్తుచేశారు. 1959లో కడెం వాగు ప్రాజెక్టు కట్టలు, గేట్లు కొట్టుకుపోయాయి. సింగూర్ డ్యాం, ఎల్లంపల్లి, సాత్నాల ప్రాజెక్టులు కూడా కొట్టుకుపోయాయి. పుట్టగండి ప్రాజెక్టు ప్రారంభించగానే కొట్టుకుపోయింది. కాంగ్రెస్ హయాంలోనే పంజాగుట్టలో ఫ్లైఓవర్ కూలి పలువురు చనిపోయారు. పొరుగు రాష్ట్రంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది.
పులిచింతల డ్యామ్ గేట్లు ఇప్పటికీ కొట్టుకుపోయే ఉన్నాయి. పోలవరం డయా ఫ్రం వాల్ దెబ్బతిన్నది. ప్రాజెక్టుల్లో ఇలాంటి ఘటనలు జరిగితే కారకులను శిక్షించి, పునరుద్ధరణ చేసి రైతులకు న్యాయం జరిగేలా చూ స్తారు. కానీ కాంగ్రెస్ తరహాలో బురద రాజకీయాలు చేయరు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాళేశ్వరం స్టడీ టూర్కు వచ్చి మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ రిజర్వాయర్లను చూసి తెలంగాణ ఇరిగేషన్ను ప్రశంసించారు. కానీ స్థానిక కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం నల్లగొండ సభ డైవర్షన్ టూర్ పెట్టుకున్నారు’ అని విమర్శించారు.
స్థిరీకరణ ఆయకట్టు చెప్పరెందుకు?
ఇంజినీర్లు వాస్తవాలు చెప్తున్నా సీఎం రేవంత్రెడ్డి దబాయించి మరీ అబద్ధాలు చెప్తున్నారని హరీశ్రావు నిప్పులు చెరిగారు. వాస్తవాలను దాచిపెడుతున్నారని మండిపడ్డారు. రూ.94 వేల కోట్లు ఖర్చు పెట్టినా కాళేశ్వరం ద్వారా రూ.98 వేల 570 కొత్త ఆయకట్టుకు మాత్రమే నీరందిస్తున్నారని సీఎం అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవంగా కొత్త ఆయకట్టు అంతకంటే ఎక్కువే ఉంటుందని వెల్లడించారు.
ఒక్క రంగనాయకసాగర్ ప్రాజెక్టు కింద 1.10 లక్షల ఎకరాలకు నీరందుతున్నట్టు ఇటీవల మంత్రి కొండా సురేఖనే స్వయంగా వెల్లడించారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కెనాల్స్ ద్వారా 546 చెరువులు నింపి 39 వేల ఎకరాలకు, కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీ నీళ్లకు కలపడం ద్వారా 2,143 చెరువులు నింపి తద్వారా మరో లక్షా 67 వేల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయని తెలిపారు. ఎస్సారెస్పీ స్టేజ్ 1, స్టేజ్2 ఆయకట్టుతోపాటు మొత్తంగా 17 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగిందని, రెండు పంటలకు నీళ్లు అందుతున్నాయని, మొత్తంగా 20 లక్షల 33,572 ఎకరాలకు నీళ్లు అందించామని హరీశ్రావు వెల్లడించారు.
హల్దీ వాగు, కూడవెళ్లి వాగు ద్వారా 20 వేల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయని, ఇవేవీ ఇంజినీర్లు చెప్పకుండా రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలు మరుగున పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి, డోర్నకల్, మహబూబాబాద్, ముస్తాబాద్, దుబ్బాక, మెదక్, గజ్వేల్ తదితర ప్రాంతాల రైతులను అడిగితే కాళేశ్వరం జలఫలాలను వివరిస్తారని అన్నారు.
తట్టమట్టి ఎత్తకుండా అంచనాలు పెంచారు
కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను విపరీతంగా పెంచారని కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న ఆరోపణలను హరీశ్రావు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రూ.17 వేల కోట్ల అంచనాతో 2007లో ప్రతిపాదించిందని, తట్ట మట్టి ఎత్తకుండానే 2008లో దాని అంచనాలను రూ.38 వేల కోట్లకు పెంచిందని, కేంద్ర జల సంఘానికి నివేదించే నాటికి అది రూ.40 వేల కోట్లకు చేరిందని తెలిపారు.
ప్రాజెక్టు అంచనా విలువ రూ.40 వేల కోట్లకు ఎందుకు, ఎలా పెరిగిందని నిలదీశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో రిజర్వాయర్ల సా మర్థ్యం 14 టీఎంసీలే ఉండగా, కాళేశ్వరంలో 141 టీఎంసీలని, కొత్త జలాశయాలు ప్రతిపాదించామని, చెరువులను అనుసంధానించటం తో అదనపు నిర్మాణాలు, భూసేకరణ, పునరావాసం కోసం అదనంగా ఖర్చు పెరుగుతుందని వివరించారు.
ప్రభుత్వం వెంటనే టెక్నికల్ సమస్య తెలుసుకొని యుద్ధప్రతిపాదికన మేడిగడ్డ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని, రైతులకు న్యాయం జరిగేలా చూ డాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, పాడి కౌశిక్రెడ్డి, సంజయ్, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాలువలు తవ్వండి
ఏ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలోనైనా మొదట హెడ్వర్స్ అంటే డ్యామ్లు, బరాజ్లు, స్పిల్వే గేట్లు, జలాశయాలు.. ఎత్తిపోతల పథకాలైతే పంప్హౌస్లు, సర్జ్పూల్స్, విద్యుత్తు సబ్స్టేషన్లు, విద్యుత్తు లైన్లు, డెలివరీ సిస్టర్న్లు తదితర అనుబంధ నిర్మాణాలు పూర్తిచేస్తారని, వాటిపైనే ప్రభుత్వాలు నిధులు కేటాయించి ఖర్చు చేస్తాయని హరీశ్రావు వివరించారు.
అవి నిర్మాణం కాకుండా ఆయకట్టుకు నీరివ్వలేమని, వాటి తర్వాతనే ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణంపై ఖర్చు చేస్తారని తెలిపారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ విషయంలో పనులు పూర్తి చేయకనే నీళ్లు ఇవ్వలేదని ఉదహరించారు. తాము అధికారంలోకి వచ్చాకనే అన్ని పూర్తిచేసి నీళ్లు అందించామని గుర్తుచేశారు.
కాంగ్రెస్ హయాంలో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా 27 వేల ఎకరాలకు మాత్రమే సాగునీళ్లు అందిస్తే, తాము పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి 6,36,700 ఎకరాలకు నీళ్లు అందించామని తెలిపారు. తాము చేసినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేయాలని, కాళేశ్వరం కాల్వలు తవ్వి పూర్తి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని సూచించారు. లేదంటే ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీళ్ల ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.