Harish Rao | పంట బీమా అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదర గొట్టిన సీఎం రేవంత్ నాలుగు సీజన్లుగా పంట బీమా అమలు చేయకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. మాటలు కోటలు దాటితే.. సీఎం రేవంత్ ఆచరణ గడప కూడా దాటదు అనడానికి ఇప్పటికీ అమలు కాని పంటల బీమా మరో ఉదాహరణ అన్నారు. ఎన్నికలు వస్తే హామీలు గుప్పించడం, అధికారంలోకి వచ్చాక ‘మొండిచేయి’ చూపడం హస్తం పార్టీకి అలవాటుగా మారిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, రోట్లో తలపెట్టిన చందంగా మారింది రైతుల పరిస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణం నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంట బీమా పథకం తెస్తాం’ అని అభయహస్తం మేనిఫెస్టో, వరంగల్ రైతు డిక్లరేషన్లో హామీలు ఇచ్చారని.. ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమం ఆధారంగా చేసుకొని రాష్ట్రంలో పంట బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తాం’ అని చెప్పి ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్ (ఓటాన్ అకౌంట్తో సహా) ప్రసంగాల్లోనూ చెప్పారని గుర్తు చేశారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి, బడ్జెట్లో చెప్పిన మాటలకు విలువ లేకుండాపోయిందన్నారు. గత బడ్జెట్లో రూ.1300 కోట్లు కేటాయించి.. కేవలం కాగితాలకు పరిమితం చేశారే తప్ప.. రూపాయి విదిల్చింది లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు పంటల బీమాకు అతీగతీ లేక పోవడం కాంగ్రెస్ మార్క్ రైతు వ్యతిరేక విధానానికి నిదర్శనమన్నారు. నిజంగా పంట బీమా అమలు చేయాలనే చిత్తశుద్ధి గనక ఉంటే.. మే, జూన్ నెలల్లోనే టెండర్లు పిలవాల్సి ఉందని, కానీ ఆ ప్రక్రియ ఇప్పటికీ చేపట్టక కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు. అకాల వర్షాలు, వడగండ్లు, ఇతర విపత్తులు వచ్చిన ప్రతిసారి సాయం అందక రైతన్నలు మరింత చితికిపోతున్నారని.. పంట బీమా అమలు చేయకపోవడం, రైతు భరోసా సరిగ్గా ఇవ్వకపోవడంతో రైతులు అప్పుల పాలై కోలుకోవడం లేదన్నారు. సర్వేల పేరుతో కాలయాపన తప్ప, నష్ట పరిహారం పూర్తి స్థాయిలో ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వ్యవసాయం, రైతాంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తున్నదని.. రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టారని.. రైతు కూలీలకు ఆత్మీయ భరోసా అటకెక్కించారని మండిపడ్డారు.
రుణమాఫీ చారాణ చేసి బారాణ మందిని మోసం చేసారని.. అన్ని పంటలకు బోనస్ అని, సన్నాలకే పరిమితం చేశారన్నారు. సన్నాలకు రూ.1200 కోట్ల బోనస్ డబ్బులను ఇప్పటికీ చెల్లించక రైతులకు బాకీ పడ్డరని.. పంట బీమా అని నాలుగు సీజన్లుగా ఉసూరుమనిస్తున్నారన్నారు. మరోవైపు యూరియా కొరత వేధిస్తున్నా ప్రభుత్వానికి ఉలుకులేదు పలుకులేదన్నారు. అందాల పోటీల రివ్యూలపై పెట్టిన శ్రద్ధ ఒక్కటైనా రాష్ట్రంలోని యూరియా సరఫరా కొరకు పెట్టి ఉంటే.. యూరియా కొరత వచ్చేది కాదన్నారు. ఆదిలాబాద్ జిల్లా, తలమడుగు మండలం పల్లి(బీ) పాక్స్లో ఎరువుల కొరత కారణంగా పల్లి(బి), పల్లి(కె) గ్రామస్తుల అవస్థలు నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ సహకార సొసైటీలో యూరియా కొరకు ఉదయం నుంచి క్యూ కట్టిన రైతులు కామారెడ్డి జిల్లా, గాంధారి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ముందు రోడ్డుపై రైతులు బైఠాయించారన్నారు.
రైతులు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి)లో యూరియా కోసం బారులు తీరిన రైతులు, మహిళలు.. రాష్ట్రంలోని అన్ని సహకార సొసైటీలలో ఇదే పరిస్థితి ఉందన్నారు. నాట్లు పడకముందే యూరియా కొరత ఏర్పడితే, రైతులపై మీ శ్రద్ధ ఏ పాటి ఉందో స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఇప్పటికైనా వైఖరి మార్చుకొని రైతు సంక్షేమం మీద శ్రద్ధ పెట్టకుంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రైతాంగం నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కోక తప్పదన్నారు. అన్ని కోణాలలో రైతును వంచించి, వ్యవసాయాన్ని అస్తవ్యస్తం చేస్తూ, పండుగ చేశామంటూ డబ్బా కొట్టుకుంటూ సంబరాలు చేసుకున్న ఘనత రేవంత్దేనన్నారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి, ఎన్నికల మేనిఫెస్టోలో, బడ్జెట్ ప్రసంగాల్లో పంట బీమా అమలు చేస్తామని చెప్పిన మాటను నిలుపుకోవాలని, యూరియా కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.