హైదరాబాద్: రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వర ప్రాజెక్టు కూలినట్లు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్పై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని, తాము చెప్పే విషయాలు నూటికి నూరుపాళ్లు నిజమన్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు-వాస్తవాలు’ అనే పేరుతో తెలంగాణ భవన్లో హరీశ్రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్హౌస్లు, 203 కి.మీ సొరంగాలు, 1,531 కి.మీ గ్రావిటీ కాలువలు, 98 కి.మీ ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు నీటి ఎత్తిపోతలు. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీరు ఎత్తిపోసేలా మొదట రూపకల్పన చేశారు. తమ్మిడిహట్టి వద్ద నీళ్లు తక్కువ ఉంటాయని ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చాం. మేడిగడ్డ బ్యారేజీని 7 బ్లాకులుగా 85 పియర్లుగా నిర్మించారు. కాళేశ్వరం లేకుండా పంటలు పండాయని కాంగ్రెస్ చెబుతోంది. ఈ ప్రాజెక్టు వల్లనే యాసంగిలోనూ పంటలు పండాయి. ఈ ప్రాజెక్టుకు 3 వనరుల ద్వారా నీటి లభ్యత ఉంది. ఆ నీటితో వేలాది చెరువులు నింపొచ్చు. మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్ వరకు నిర్మించినవన్నీ వాడకంలోనే ఉన్నాయి. కాళేశ్వరం కింద కాలువ ద్వారానే 90 వేల ఎకరాలకు నీరు అందించొచ్చు.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు గోదావరి జలాల్లో 940 టీఎంసీలు కేటాయించారు. తెలంగాణ గోదావరి జలాలను ఏనాడూ 400 టీఎంసీలకు మించి వాడుకోలేదు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగేళ్లలో అనుమతులు కూడా సాధించలేదు. ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించకుండానే కాలువల తవ్వకం పనులు చేపట్టారు. 2007లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వ్యయాన్ని రూ.17 వేల కోట్లుగా చెప్పారు. ప్రాజెక్టు ప్రారంభించకముందే 2011నాటికి అంచనా వ్యయాన్ని రూ.40 వేల కోట్లకు పెంచారు.
ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కేవలం 11 టీఎంసీల నీటి మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండేది. కానీ, కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా 16 రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది. మేడిగడ్డ, అన్నరం, సుందిళ్ల, మేడారం, మల్కపేట, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బుస్సాపూర్, గంధమల్ల, కొండం చెరువు, భూంపల్లి, మోతె, ధర్మారావుపేట, కాటేవాడి, ముద్దోజివాడి, తిమ్మక్కపల్లి రిజర్వాయర్లలో 141 నీటి నిల్వ సామర్ధ్యం ఉంది. ఒక్క మల్లన్న సాగర్ లోనే 50 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. ఎస్సారెస్పీకి నీళ్లు రానప్పుడు, కడెం నిండకుండా ఎల్లంపల్లికి కూడా నీళ్లు రానపుడు, మేడిగడ్డలో నీళ్లుంటాయి. ఎక్కడా నీళ్లు లేనపుడు కూడా నీళ్లు లభ్యమయ్యే పాయింట్ మేడిగడ్డ. వర్షాలు బాగా కురిసినపుడు ఎస్సారెస్పీ నుంచి మిడ్ మానేరుకు నీళ్లు తెచ్చుకున్నం.
మిడ్ మానేర్ లో పంప్ చేసి నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ వరకు నీళ్లు తెచ్చుకున్నం. కాళేశ్వరంలో అంతర్భాగమైన వీటి అంతటా లక్షల ఎకరాల్లో పంటలు పండినయి. కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మోటార్లతోనే అన్నపూర్ణకు నీళ్లొచ్చినయి. అన్నపూర్ణలో పెట్టిన మోటార్లతో రంగనాయక సాగర్కు నీళ్లొచ్చినయి. రంగనాయక సాగర్ మోటార్లతో మిడ్ మానేర్కు నీళ్లొచ్చినయి. మిడ్ మానేర్ మోటార్లతో మల్లన్నసాగర్కు, అక్కడి మోటార్లతో కొండ పోచమ్మ సాగర్కు నీళ్లొచ్చినయి. ఇదంతా కాళేశ్వరంలో భాగంగానే.. వ్యవస్థ అంతా పనిచేయడం వల్లనే లక్షల ఎకరాల్లో పంట పండింది.
కాళేశ్వరం కింద ఒక్క ఎకరా పారలేదు అంటడు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే, 50 వేల ఎకరాలు మాత్రమే సాగయింది అంటడు. ఇంకో కాంగ్రెస్ నాయకుడేమో లక్ష ఎకరాలే పారింది అంటడు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు, ఒక్కో నాయకుడు ఒక్కో లెక్క చెబుతడు. కాళేశ్వరం నీళ్లతో ఇప్పటి వరకు నేరుగా 98,570 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందింది. కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల ద్వారా నింపిన 456 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 39,146 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందింది. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఎస్సారెస్పీ స్టేజీ 1, ఎస్సారెస్పీ స్టేజీ 2 మరియు నిజాంసాగర్ నీటితో నింపిన 2143 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 1 లక్షా 67 వేల కొత్త ఆయకట్టు సాగయింది. ఎస్సారెస్పీ స్టేజీ 1, ఎస్సారెస్పీ స్టేజీ 2, నిజాంసాగర్ ప్రాజెక్టులకు కాళేశ్వరం నీరందించి 17 లక్షల 8 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరిగింది. కాళేశ్వరం నీళ్లు కూడెల్లి వాగు, హల్దీ వాగుల ద్వారా 66 చెక్ డ్యాములతో మరో 20 వేల 576 ఎకరాలకు సాగునీరందింది.’ అని హరీశ్రావు అన్నారు.