నేడు ప్రతి ఇంట్లో కేసీఆర్ ఉన్నడు.. కన్నకొడుకోలె కంటి అద్దాలు పెట్టించిండు.. పెద్దకొడుకోలె ఆసరా పింఛన్ ఇచ్చిండు.. మేనమామ వలె కల్యాణలక్ష్మి ఇచ్చిండు.. పెద్దన్నలాగా రైతుబంధు ఇచ్చిండు..
– ఆత్మీయ సమ్మేళనంలో మత్రి హరీశ్రావు
సిద్దిపేట, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ప్రధాని మోదీ వచ్చిన ప్రతిసారీ రాష్ట్రంపై విషం చిమ్మిపోతున్నాడు. హైదరాబాద్కు వచ్చి ఏం మాట్లాడిండు? ఎంతసేపూ మన మీద బురద జల్లడం తప్ప మరోటి లేదు. కేంద్రానికి రాష్ట్రం సహకరించడం లేదని మాట్లాడుతున్నారు. ఇదేదో దొంగే దొంగ అన్నట్టుగా ఉన్నది. అసలు ఎవరికి ఎవరు సహకరించాలి? బయ్యారం ఉక్కు ప్యాక్టరీ ఎగబెట్టింది మీరు కాదా? రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క ప్రాజెక్ట్కైనా జాతీయ హోదా ఇవ్వకుండా, రాష్ర్టానికి సహకరించకుండా ఇబ్బంది పెడుతున్నది మోదీ కాదా?’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు.
సిద్దిపేట జిల్లా రాఘవాపూర్ గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావుకు సిద్దిపేట శివాజీ సర్కిల్ నుంచి రాఘవాపూర్ వరకు విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో భారీ బైక్ర్యాలీతో స్వాగతం పలికారు. ఆత్మీయ సమ్మేళనానికి వివిధ గ్రామాల నుంచి మహిళలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రైతుల ఇంటికి కరెంట్ బిల్లులు పంపాలన్నది మోదీ కాదా? రైతుల బాయిల కాడ మీటర్లు పెట్టకపోతే రూ.30 వేల కోట్లు ఆపింది బీజేపీ ప్రభుత్వం కాదా?’ అని ప్రశ్నించారు. ఆ నిధులు ఎందుకు ఆపారో మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం తప్పా? అని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నది బీజేపీ కాదా? అని నిలదీశారు.
యూపీలో సాగుకు ఇంజిన్లే దిక్కు
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న ఉత్తరప్రదేశ్లో కరెంటు సరిగా లేక ఇప్పటికీ 20 లక్షల మోటర్లలో ఆయిల్ పోసుకొని నడిపించుకుంటున్నారని, ఇంజిన్లతోనే అక్కడి రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. తెలంగాణలో నాణ్యమైన కరెంటు ఇవ్వడంతో రైతులు చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నారని చెప్పారు. ఇటీవల సిద్దిపేటలో పర్యటించిన మహారాష్ట్ర రైతులు ఇక్కడి చెరువులు మండుటెండల్లో మత్తళ్లు దుంకుతుంటే సంతోషపడ్డారని చెప్పారు. బీజేపీ ఏలుతున్న మహారాష్ట్రలోని షోలాపూర్లో నాలుగు రోజులకొకసారి నల్లా వస్తదని ఎద్దేవా చేశారు. మండుటెండల్లో సిద్దిపేట రూరల్ మండలంలో చెరువులు మత్తడి దుంకుతున్నాయని, కాలంతో పని లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్తో రెండు పంటలు పండేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పారు.
తెలంగాణ వచ్చిన కొత్తలో సిద్దిపేట జిల్లాలో రూ.138 కోట్ల విలువైన వడ్లు పండితే, గత సంవత్సరం రూ.1,548 కోట్ల విలువైన ధాన్యం దిగుబడి వచ్చిందని వివరించారు. కేసీఆర్ అనే అద్భుతమైన దీపం ఉన్నందనే ఇది సాధ్యమైందని చెప్పారు. కలలో కూడా రాఘవాపూర్ చెరువు మత్తడి దూకుతుందని అనుకోలేదన్నారు. ‘నేడు ప్రతి ఇంట్లో కేసీఆర్ ఉన్నడు.. కన్నకొడుకోలే కంటి అద్దాలు పెట్టించుండు.. పెద్దకొడుకోలే ఆసరా పింఛన్ ఇచ్చిండు.. మేనమామ వలే కల్యాణలక్ష్మి ఇచ్చిండు.. పెద్దన్నలాగా రైతుబంధు ఇచ్చిండు..’ అని వివరించారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఇంత మంచి పనులు చేశారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలని, ఇంత మంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
చర్మం వొలిచి చెప్పులు కుట్టిచ్చినా తక్కువే
ఈ బలగం చూస్తుంటే ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. నా ఊపిరి ఉన్నంత వరకు మీ సేవ చేస్తా. పదవులు ఉండొచ్చు. పోవచ్చు. కానీ, మీ ప్రేమ వెలకట్టలేనిది. చర్మం వొలిచి చెప్పులు కుట్టిచ్చినా తక్కువే..’ అంటూ మంత్రి హరీశ్రావు భావోద్వేగానికి లోనయ్యారు. సిద్దిపేట దవాఖానను సూపర్ స్పెషాలిటీ దవాఖానగా మారుస్తామని, జీవితకాలమంతా మీ సేవలో ఉంటానని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్, గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయిచంద్, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, సుడా ఛైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.