యాదాద్రి భువనగిరి : ఓటమి శాశ్వతం కాదు. గెలుపునకు నాంది. బీఆర్ఎస్(BRS )కు ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. శుక్రవారం భువనగిరి (Bhuvanagiri) అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే జగదీష్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..ఓడిపోయిన నియోజకవర్గం సభలో పట్టనంతమంది రావడం మన బలానికి చిహ్నం అన్నారు.
ఎన్నికల హామీలను నిలబెట్టుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రచారంలో అబద్ధాలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీపై అధికారంలోకి వచ్చాక ప్రజల్లో అసహనం పెరిగిందన్నారు. రైతుబంధు పడడం లేదని, జెడ్పీ చైర్మన్గా బాధ్యతతో సందీప్ రెడ్డి అడిగితే ఆయనను పోలీసులతో బయటికి పంపించారని ఆరోపించారు. మంత్రి
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నల్గొండపై ప్రేమ ఉంటే సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడాలని సూచించారు. రైతు బంధు పడడం లేదని ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టాలనడం ఏం సంస్కారమని ప్రశ్నించారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల నల్గొండకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఎన్నికల్లో మన గురించి పచ్చి అబద్ధాలు చెప్పిందని పేర్కొన్నారు. ఎన్నికల హామీలను తప్పించుకోవడానికి అసలు అప్పును రెట్టింపు చేసి గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ అపాయింట్మెంట్ మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు.
మరి ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎందుకివ్వలేదో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. స్థానిక ఎన్నికల్లో కష్టపడి పోరాడి సత్తా చూపిద్దామన్నారు. అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా మనం ప్రజల పక్షం ఉందామన్నారు.